నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (9)
‘తన విషాగ్నితో తక్షకుడు నా తండ్రిని ఎలాగయితే దగ్ధంచేసి చంపాడో, అలాగే నేను ఆ తక్షకుని వాని మిత్ర బాంధవులతో సహా యాగాగ్ని శిఖలలో పడి దహనమయిపోయేట్లుగా చేసి స్వర్గలోక వాసుడయిన నా తండ్రికి, ఉదంకునకు ప్రీతి కలిగిస్తాను’ అని చెప్పి, సడలని నిశ్చయానికి వచ్చి, కాశీరాజు కుమార్తె అయిన వపుష్ఠమయ మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగం చేయాలని దీక్షవహించి, శిల్పశాస్త్రనిపుణులయిన ఆచార్యులచే నిర్మించబడి యజ్ఞోపకరణ సామగ్రి అంతా సమృధ్ధిగా సమకూర్చబడీ వున్న యాగశాలలో, బ్రాహ్మణులతో కూడి వున్న ఆ జనమేజయ మహారాజు వద్దకు వాస్తువిద్యా నిపుణుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘రాజా, అన్నీ శాస్త్ర ప్రకారం అమర్చుకుని చేస్తున్నప్పటికీ, ఈ యజ్ఞం చివరిదాకా నడవదు, మధ్యలోనే ఆగిపోతుంది’ అంటాడు.
ఆ బ్రాహ్మణుడు చెప్పినది విని కూడా, చ్యవనకుల విఖ్యాతుడయిన చండభార్గవుడు హోతగా, పింగళుడు అధ్వర్యుడుగా, శార్జ్గవుడు బ్రహ్మగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతాది మహామునులు సదశ్యులుగా యాజ్ఞికులు ఆ యజ్ఞాన్ని మొదలుపెడతారు. యజ్ఞం కొనసాగే కొలదీ, ఆ యజ్ఞమంత్రాల మహిమకు నాగప్రములందరూ భయకంపితులై ఒకరొకరిని పిలుచుకుంటూ వరుసగా వచ్చి ఆ యాగకుండం నుంచి పుడుతున్న అగ్నిలో ఆర్తనాదాలు చేస్తూ వచ్చి పడి కాలిపోసాగారు. అలా వచ్చి పడిన వాళ్ళలో కోటిశ, మానస, పూర్ణ, శల, ఫాల, హలీమక, పిఛ్ఛల, గౌణప, చక్రాది వాసుకి కుల సంభవులు, పుఛ్ఛాండక, మండలక, విరోహణ, సురోమ, మహా హన్వాదులయిన తక్షక కుల సంభవులు, పారావత, పారిజాతయాత్ర, పాండర, హరిణ, కృశ, విహంగాది ఐరావత కుల సంభవులు, నేరక, కుండల, వేణి, బాహుక, శృంగబేర, ధూర్తక, ప్రాతరాతకాదులయిన కౌరవ్య కుల సంభవులు, శంకుకర్ణ, పిఠరక, కుఠార, సుఖసేచన, పూర్ణాంగద, పూర్ణముఖ, సుచిత్ర, పరాశర, తరుణక, మణి స్కందారుణ్యాదులయిన ధృతరాష్ట్ర కులసంభవులూ…ఇలా వేలాదిగా వుంటారు. అప్పుడు తక్షకుడు కూడా చాలా భయపడినవాడై, పరుగెత్తుకుని ‘స్వామీ, రక్షించు రక్షించు రక్షించు!’ అంటూ సురగణాధిపుడైన ఇంద్రుని వద్దకు చేరుతాడు.. ఇంద్రుడు, పూర్వం విష్ణుమూర్తి వచనం వలన వాసుక్యాది సర్పకుల ముఖ్యులకు సర్పయాగం వలన హాని లేకపోవడమన్నది తెలిసినవాడు కాబట్టి, నీకొచ్చిన భయమేమీ లేదు అని చెప్పి తక్షకుని తన వద్ద వుండనిస్తాడు. ఇక్కడ వాసుకి తన వంశజులయిన, తన భ్రాతృవంశజులయిన ఎన్నెన్నో మహా సర్పాలు జనమేజయుడు నిర్వహించే సర్పయాగాగ్నిలో పడి దహించుకు పోవడం చూసి శోకతప్త హృదయుడై , తన చెల్లెలయిన జరత్కారువును చూసి ‘ఈ ఉపద్రవం నుంచి మాకు స్వస్తి చేకూరాలంటే అది నీ కుమారుడయిన ఆస్తీకుని వలననే అవుతుంది. అది బ్రహ్మవచనం. యేలాపుత్రుడు ఈ సంగతిని మాకు చెప్పాడు. జరత్కార మహామునికి నిన్నిచ్చి వివాహం చేయడం కూడా ఈ ప్రయోజనాన్ని ఆశించే. ఇంకొక్క నిమిషం సమయం వృధా అయినా మొత్తం సర్పకులమంతా తుడిచిపెట్టుకు పోయే ప్రమాదముంది. కాబట్టి ఆస్తీకుడు సత్వరం జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళి ఆ సర్పయాగాన్ని ఆపేయించేట్లు చేయాలి’ అంటాడు.
అన్న మాటలను విన్న జరత్కారువు, కొడుకును చూసి నీ మేనమామ చెప్పినట్లుగా చేయమంటుంది. దానికి ఆస్తీకుడు ‘అలాగే!ఇప్పటివరకూ పడి దగ్ధమైపోయినవే తప్ప మిగతా ఏ కద్రువకుమారుడినీ ఆ సర్పయాగాగ్నిలో పడనీయను. ఇప్పుడే ఆ సర్పయాగాన్ని ఆపిస్తాను’ అని చెప్పి వాసుక్యాది ప్రముఖులకు మాట ఇచ్చి, వేదవేదాంగ పారగులయిన బ్రాహ్మణోత్తములు తనకు తోడై రాగా జనమేజయుడు చేస్తున్న సర్పయాగ సదనానికి వెళ్ళి, అక్కడ తన దేహంనుంచి వెలువడిన ఉజ్వలమైన కాంతితో నిండి ఆ ప్రదేశమంతా ప్రకాశిస్తూండగా , స్వస్తివచన పూర్వకంగా ‘చంద్రవంశానికి అలంకారము వంటివాడవై, రాజర్షివై, ధారుణి ప్రజలనందరనూ దయతో ధర్మం తప్పకుండా పాలిస్తూ వున్న వాడవు’ అంటూ జనమేజయుని, అతనిచే చేయబడుతూన్న యజ్ఞ మహిమను, ఆ యజ్ఞంలో పాల్గొన్న ఋత్విజులను, సదస్యులను, అగ్నిభట్టారకుని పలు విధాల స్తుతించగా, ఆ స్తుతికి అందరూ సంత్రుప్తులయిన పిమ్మట, జనమేజయుడు ఆస్తీకుని చూసి ‘మునీంద్రా, నీకు ఏది ఇష్టమో చెప్పు, అది ఇస్తాను’అంటాడు. అందుకు సంతోషించిన ఆస్తీకుడు, ఇప్పుడు నీవు చేస్తున్న ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపేయమంటాడు. అక్కడి విప్రజనం కూడా ‘ఇలాంటి విశిష్ఠ విప్రుడు, మహా తపోధనుడు, పాత్రుడు అయినట్టి వానికి ప్రియం కలిగేలాగా ఏమిచ్చినా అది మంచికే అవుతుంది కాబట్టి, అతడు కోరినది సంతోషంగా ఇవ్వు మహారాజా!’ అంటారు. ఆ సమయానికి యజ్ఞమంత్రాల ప్రభావం వలన ఇంద్రుని రక్షణ నుంచి కూడా బయటపడిన వాడైన తక్షకుడు ఇక తప్పక యాగాగ్నిలో పడడానికి దావాగ్నిశిఖలాగా మండుతూ జనులందరూ ఆశ్చర్యపడేట్లుగా గగన వీధిన వస్తూన్న వాడిని ఆపి ఆస్తీకుడు ‘ఓహో తక్షకా, ఇక నీవు వెనుకకు తిరిగి వెళ్ళిపో!’ అంటాడు. అలా ‘తల్లి శాపం కారణంగా ప్రారబ్ధమయిన సర్పయాగమనే మృత్యు ముఖం నుంచి వారిని కాపాడాడు ఆస్తీకుడు’ అంటూ అక్కడి సదస్యులు ఎంతగానో సంతోషపడి ఆస్తీకుని స్తుతించారు. జరత్కారు మునీంద్రునికి జరత్కారువుకూ జన్మించిన మహామునియైన ఆస్తీకుని మనసులో తలుచుకుంటే సర్పభయం పోతుందనీ, అంతే కాకుండా ఆ ఆస్తీకుని చరితం విన్న వారికి సర్వపాప క్షయం అవుతుందనీ చెబుతారు.
(ఇక్కడితో నన్నయ భట్టారకునిచే రచించబడిన శ్రీ ఆంధ్ర మహాభారతం, ఆది పర్వంలో నాగ గరుడోత్పత్తి, సముద్ర మంథనము, అమృత సంభవము, సౌపర్ణోపాఖ్యానము, జనమేజయ సర్పయాగము, ఆస్తీకు చరితము అన్నది ద్వితీయాశ్వాసం, సమాప్తం).