అమరావతి స్తూపం జగత్ప్రసిధ్ధం. బుధ్ధుడు ఇక్కడనే ‘Kalachakra’ ను బోధించాడని చెబుతారు. అంటే ఈ ప్రదేశం బుధ్ధుని జీవితకాలం నుంచీ, అంటే క్రీ.పూ.500 ప్రాంతం నుంచే ప్రాముఖ్యాన్ని సంతరించుకుని ఉండినదిగా అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు.
వైశాల్యంలో అమరావతి స్తూపం భారతదేశంలో నిర్మితమైన బౌధ్ధ స్తూపాలన్నిటిలోకీ పెద్దది.
స్తూప నిర్మాణంలో ఆంధ్ర శిల్పుల పనితనం ఇక్కడి శిల్పంలో ఏ మేరకు కనబడుతుందనేది ఇప్పటికే సవివరంగా చాలా చోట్ల చెప్పబడింది.
ఈ స్తూపం ఉన్న ఆవరణలో నా దృష్టిని ఆకర్షించినవి ప్రముఖంగా రెండు; ఆ రెంటిలో మొదటిది – Votive Stupa అనబడే ‘మొక్కుబడి స్తూపాలు ‘, రెండవది Ayaka pillar ఆర్యక లేద ఆయక స్తంభం అనేవి. వీటిలో మొక్కుబడి స్తూపం అనేది బౌధ్ధ మతానుయాయులు వాళ్ళ మొక్కుబడులను చెల్లించుకోవడానికి ప్రముఖమైనటువంటి బౌధ్ధ స్థలాలను సందర్శించే సందర్భంలో నిర్మింపజేసినవి. అలా కానప్పుడు, మోక్షం కోసంగా నిర్మింపజేసినవిగానీ అయి వుంటాయని చెబుతారు. అలా బౌధ్ధ భక్తులచే నిర్మింపజేయబడిన మొక్కుబడి స్తూపాలు అమరావతి స్తూపం ఆవరణలో వున్నాయి. పెద్ద స్తూపాలకు చిన్న ప్రతిరూపాల్లా చూడడానికి చాల బాగున్నాయి.
ఆయక స్తంభం లేదా ఆర్యక స్తంభం అంతే పూజనీయ మైన స్తంభం అని అర్ధం. బుధ్ధ భగవానుని జీవితంలోని అయిదు ముఖ్యమైన ఘట్టాలకు ఈ ఆయక స్తంభం ప్రతీక కనుక పూజనీయమైనది అని అంటారు. ముఖ్య స్తూపం చుట్టూ ప్రదక్షిణకు వెళ్ళబోయే ముందు ఈ ఆయక స్తంభానికి మొక్కి వెళ్ళడం ఆచారమని చెబుతారు.
ఒక క్షేత్రానికి సంబంధించి దగ్గర దగ్గరగా రెండువేల అయిదువందల సంవత్సరాలకు సంబంధించి గుర్తించ గలిగిన చరిత్ర ఉండడం చిన్న విషయం కాదు. అందుకనే, అమరావతి లాంటి ప్రదేశానికి వెళ్ళి నపుడు, అక్కడి సంగతులను గురించి తెలుసు కున్నపుడు ఆనందం కలుగుతుంది. ఎందుకో చెప్పలేను గాని వదిలి వచ్చేస్తుంటే చివరలో కొంత బాధ లాంటి నిట్టూర్పు కూడా కలుగుతుంది!