పల్లవ రాజు రాజసింహుడు – కైలాసనాధ దేవాలయం, కాంచీపురం
Ancient India లో – అంటే క్రీ.శ.1000 ని ఒక సరిహద్దుగా అనుకుని ఆలోచించినా కూడా, అంతకు ముందు పాలించిన రాజవంశాలకు చెందిన రాజులూ చక్రవర్తులూ కేవలం రాజ్యాధికారం గురించి, చేయ్యాల్సిన యుధ్ధాలను గురించి, గెలవాల్సిన పొరుగు రాజ్యాలను గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచించకుండా, తాము పాలిస్తున్న భూభాగంలో కళలను గురించి, వాటి అభివృధ్ధి గురించి, ఆయా రంగాల కళాకారులకు ఇవ్వాల్సిన చేయూత గురించి గూడా పట్టించుకోవాలి, ఆ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలి అన్న philosophy కి అనుగుణంగా నడుచుకుంటూ రాజ్య పాలన చేసారు. పల్లవ రాజవంశానికి చెందిన రాజులూ, చక్రవర్తులూ అదే బాటను అనుసరించి పాలించినవారే! రాజులు స్వతహాగా ఏ ధర్మాన్ని ఆచరించినా, రాజ్యంలోని బౌధ్ధ, జైన ఇత్యాది ఇతర ధర్మాల అనుచరులకు కావలసిన అన్ని సదుపాయాలనూ సమకూర్చారు. అన్ని ధర్మాల వారినీ సమానంగానే ఆదరించి రాజ్యంలో నివసించే అవకాశం కల్పించారు.
పల్లవ రాజులు కళలకు ఎంతగానో ప్రొత్సాహం ఇచ్చారు. ఆలయ శిల్పం వీరి కాలంలో కొత్త దారులు తొక్కింది. కొండ రాతి చరియలను (గుహాలయం) వదిలి దేవాలయం సమతల ప్రదేశంలోకి వచ్చింది. అందులో భాగంగా, ఒక బృహత్తరమైన నిర్మాణంగా దేవాలయ నిర్మాణం అనేది దక్షిణ భారత దేశంలో ఈ కైలాసనాధ దేవాలయంతోనే మొదలయింది. కాల క్రమంలో ఈ విధమైన మంచి మలుపుకు ఈ పల్లవ రాజవంశం కారణమయిందని చెబుతారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గా వున్న భూభాగాన్నే అప్పుడు – అంటే క్రీ.శ.4 – 9 శతాబ్దాలమధ్య కాలంలో – పల్లవులు వారి రాజ్యంలో ముఖ్యమైన భాగంగా పాలించారు. వారి రాజ్యాధికారం, ప్రాభవం, ఉఛ్ఛ స్థితిలో ఉన్న రోజులలో ఇప్పుడు తమిళనాడుగా ఉన్న భూభాగంలో చాలా మేరకు – అంటే కావేరీ తటం దాకా – పల్లవ రాజ్యం వ్యాపించి వుండేది. పల్లవుల రాజధాని కాంచీపురం. పల్లవ రాజులలో ముఖ్యుడైన మహేంద్రవర్మ (పరిపాలనా కాలం క్రి.శ.590-630) స్వయంగా కవి, సంగీత కళా కోవిదుడు. అంతే కాకుండా చాలా విషయాల్లో ఇతనికి వున్న బుధ్ధి కుశలతను కళాహృదయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతనికి ‘విచిత్ర చిత్తుడు’ అనే పేరు కూడా వచ్చి స్థిరపడిపోయింది. ఈయన విష్ణుకుండిన చక్రవర్తి అయిన ‘విక్రమేంద్ర వర్మ’ దౌహిత్రుడు. విష్ణుకుండినుల విజయవాడ దగ్గర మొగల్రాజపురం గుహాలయాలలోని సాంప్రదాయాలను ఈయన దక్షిణాదిన అంటే తమిళం మాట్లాడే ప్రాంతంలో ప్రవేశ పెట్టాడు.
ఈ మహేంద్రవర్మ తరువాత నాలుగోతరం వాడు రాజసింహుడు అనే నామాంతరం కలిగిన రెండవ నరసింహవర్మ అనే పల్లవరాజు. ఇతడు క్రీ.శ.700 -730 మధ్య కాలంలో రాజ్య పాలన చేశాడు. ఈ రాజసింహ పల్లవుని పరిపాలనా కాలంలో నిర్మించబడిన దేవాలయలే కాంచీపురంలోని కైలాసనాధ దేవాలయం, మహాబలిపురంలోని సముద్ర తీర దేవాలయం. ఈ రెండూ దక్షిణ భారత దేవాలయ వాస్తులో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమైన దేవాలయాలు. ఈ ఆలయాలలో అవలంబిచిన పధ్ధతికి ఈ పల్లవరాజు పేరు మీదుగానే ‘రాజసింహ పధ్ధతి’ అనే ప్రత్యేకమైన పధ్ధతిగా పేరు వచ్చింది. కాంచీపురంలోని కైలాసనాధ దేవాలయానికి ‘రాజసింహేశ్వరం’ అనే నామంతరం కూడా ఉంది. దేవాలయ నిర్మాణంలో అప్పటి దాకా అవలంబిస్తూ వస్తూండిన గుహాలయాల పధ్ధతికి స్వస్తి చెప్పి, ఆలయాన్ని ఇటుకలతోనూ, రాళ్ళతోనూ కట్టే పధ్దతిని ఈ ఆలయాల నిర్మాణంలో అవలంబించారు. ఈ పధ్ధతినే ఆ తరువాత పట్టడకల్ లోని విరూపాక్షాలయం, ఎల్లోరాలోని కైలాసనాధ దేవాలయాల నిర్మాణంలోనూ అవలంబించారని పెద్దల అభిప్రాయం.
రాజసింహుడు గొప్ప శివ భక్తుడు. గంగాధర శివునికి అంకితమీయబడిన ఈ కైలాసనాధ దేవాలయాన్ని తన ఆరాధన కోసంగానే కట్టించినట్లు ఈ ఆలయ ప్రాంగణంలో వేయించిన శాసనంలో అతడు చెప్పుకున్నాడు. ఆలయంలోని ప్రతి పార్శ్వం, ప్రతి కోణం కూడా సుందరమైన శిల్పంతో నింపివేయబడి కనుపిస్తుంది.
పల్లవులచే నిర్మించబడిన దేవాలయాలలో ‘నోరు తెరిచి వున్న సింహం తల’ motif చాలా ఎక్కువగా కనబడుతుంది. సింహం ఈ పల్లవ రాజవంశపు అధికార చిహ్నం కావడం ఇందుకు కారణం.
దుర్గ, అంబ, శక్తి, భవాని – ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ పేర్లన్నీ ఒకే స్వరూపానికి చెందుతాయి. ఆ స్వరూపం స్త్రీత్వానికి ఆది అనాది స్వరూపంగా పూజలందుకుంటూన్న శక్తిస్వరూపిణి అయిన అంబ. కైలాసనాధ దేవాలయంలోని ఈ దుర్గామాత రూపం సౌందర్యం, శక్తిమత్వం – రెండూ సమపాళ్ళలో కలగలిసి వున్న అత్యంత అద్భుతమైన రూపం. దేవాలయాలలో మలచబడిన దుర్గామాత రూపాలలో ఈ రూపం చాల పురాతనమూ, అంతగానూ సుందరమూ అయినదిగా మన్ననలందుకుంది.
ధ్యాన ముద్రలో వున్న ఈ శంకరుని ప్రతిమ సౌదర్యాన్ని వర్ణించడానికి మాటాలు చాలవు.
ఈ శిల్పాలలో ఒత్తుగా వుండి వేళాడుతూ వున్నట్లుగా వుండే ప్రస్పుటమైన యజ్ఞోపవీతం, వర్తుల స్తంభాకారంలో వుండే ఎత్తయిన కిరీతం వంటి ఆకర్ష ణీయమైన అలంకరణలు విష్ణుకుండిన శిల్పం నుంచి తీసుకోబడినాయని చెబుతారు.
కైలాసనాథ దేవాలయంలో నందీశ్వరుని ప్రతిమ ముఖ్య దేవాలయానికి కాస్త దూరంగా ఉంటుంది. అయితే, ఆ తరువాత నిర్మించబడిన శివాలయాలలో ఈ దూరం తగ్గి, నంది శిల్పం ముఖ్య దేవాలయానికి బాగా దగ్గరగా చేర్చబడి వుండడం తెలిసినదే!
కంచి లోని కైలాసనాధ దేవాలయాన్ని గురించి పూర్తిగా వ్రాయాలంటే దక్షిణ దేశపు చరిత్రకు, ఆలయ శిల్ప పరిణామ వికాసానికీ సంబంధించి సమగ్రమైన జ్ఞానం వుంటేనే గాని సాధ్యం కాదు. అందులో నాకున్న అంతంత మాత్రపు జ్ఞానంతోనూ, అక్కడక్కడా చదివి తెలుసుకున్న సమాచారంతోనూ, నా వద్ద వున్న ఫోటోల ఆదరువుతోనూ, ఈ చిన్న వ్యాసం వ్రాశాను. ముందుగానే చెప్పినట్లుగా, దక్షిణాది ఆలయ పరిణామ క్రమంలో ఈ కైలాసనాధ దేవాలయానికి ప్రత్యేకమైన, అతి ముఖ్యమైన స్థానం వుంది. అలాంటి ఈ ఆలయం గురించి ఇక్కడ నేను వ్రాసిన సమాచారంలో ఏదయినా తప్పు దొర్లి ఉండవచ్చు. అది తెలియక జరిగిన తప్పుగా భావించి ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం తెలిసిన ఈ విద్యలలో విజ్ఞులు అయిన పెద్దలు పెద్దమనసు చేసుకుని మన్నిస్తారని ఆశిస్తాను.