‘లేలెమ్మెక్కడి వాండవు
పాలసముద్రమున భోగిపర్యంకమునం
దేలెద వొక్కండవు నను
ద్రైలోక్యాధీశు నెఱుంగుదా పరమేష్ఠిన్?’ (ప్రథమాశ్వాసం 80వ పద్యం).
పరమేశ్వర కల్పిత మాయా గర్వంతో, అలా లోకాలను చూడడానికి వెళ్ళిన బ్రహ్మ, పాలసముద్రంలో శేషతల్పంపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువును చూసి, సమీపించి ఆయన సంగతిని తాహతును గుర్తించక, ఆయనను నిద్రనుంచి లేపుతూ అన్న మాటలు ఈ పద్యం.
వాండు, వీండు – ఈ విధమయిన పూర్ణబిందు సహిత ప్రయోగం శ్రీనాథుడు కూడా చేశాడనడానికి ఉదాహరణ ఈ పద్యం.
‘ఎవ్వడవు చెప్పుమనిన లే నవ్వు నవ్వి
యిందిరావల్లబుండు బ్రహ్మ కిట్టు లనియె
నే జగత్కర్తనై యుండ నెట్లు నీవు
కర్త నని పల్కెదవు సిగ్గుగాదె చెపుమ ‘ (ప్రథమాశ్వాసం 82వ పద్యం).
జగత్తు కంతటికీ నేను కర్తనై వుండగా, నీవు కర్తననడానికి సిగ్గుగా లేదా? అని బ్రహ్మను శ్రీ మహావిష్ణువు అడగడం ఈ పద్యం. ఇందులో లేనవ్వు, లేత+నవ్వు, అంటే చిఱునవ్వు. (‘సమాసంబున బ్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగా నగు’ అని బాల వ్యాకరణం, సంధి పరిచ్చేదం 36వ సూత్రం. అచ్చతెనుగు పదాలకు ఆయువుపట్టు లాంటి సూత్రాలలో ఇది ఒకటి. ప్రాత+ఇల్లు=ప్రాయిల్లు, ప్రాతయిల్లు, లేత+దూడ=లేదూడ, లేతదూడ, పూవు+రెమ్మ=పూరెమ్మ, పూవురెమ్మ, ఇలాంటి పదాలు ఇందుకు ఉదాహరణలు).
అని చెప్పినా వినిపించుకోని బ్రహ్మ, శ్రీ మహావిష్ణువుతో యుధ్ధానికి తలపడతాడు.
‘వాలిక మెఱుగుం దూపులు
నళీకాసనుడు కినుక నారాయణుపై
గీలుకొనజేసి యార్చెను
నాలుగు మోములను ద్రిభువనములు వడంకన్ ‘ (ప్రథమాశ్వాసం 92వ పద్యం).
మంచి నడక వున్న కందపద్యం ఇది. వాలిక – వాడివి అయినట్టివి, మెఱుగుందూపులు – మెరుస్తున్నట్టివి అయిన బాణాలను, నాళీకాసనుడు (నాళీకము – పద్మమును, ఆసనముగా కలవాడు) బ్రహ్మ, కినుక – కోపంతో, శ్రీ మహావిష్ణువుని నాటుకునేలా వేసి, తన నాలుగు మోములతో విజయోత్సాహంతో ముల్లోకాలూ అదిరిపడేలా పెద్దపెట్టున అరిచాడు అని ఈ పద్యం భావం.
ఇరువురి మధ్య అలా మొదలైన యుధ్ధం, చివరకు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ప్రయోగించుకునే దాకా వెళ్ళగా, ఆ పాశుపతాస్తాలనుంచి పుట్టిన అగ్ని జ్వాలలను ఆర్పడానికి వారికే వల్లగాకుండా వుండగా, ఆ స్థితిలో –
‘అస్త్రయుధ్ధము మాన్ప హర్యజుల గావ
దలచి యర్దేందు మౌళి యత్యంతకరుణ
నస్త్రములు రెంటినడుమ నయ్యవసరమున
సంభవించె మహానలస్తంభమూర్తి’ (ప్రథమాశ్వాసం 101వ పద్యం).
అర్ధేందుమౌళి – అర్ధ ఇందు మౌళి – అర్ధ చంద్రుని శిరస్సునందు కలవాడు, శివుడు. ఆ రెండు అస్త్రాల నడుమ మహాశివుడు పెద్ద అగ్నిస్తంభం లాగా పుడతాడు.
‘నడగె నస్త్రద్వయంబు నభ్యంతరమున
నగ్గికంబంబులో గాననయ్యె శివుడు
వలపె తెరలోన నున్న భావంబు దోప
మాఘకృష్ణచతుర్దశీ మధ్య రజని’ (ప్రథమాశ్వాసం 105వ పద్యం).
ఆ రెండు అస్త్రాల నడుమ, అగ్ని స్తంభంలో శివుడు, వలపె తెరలోనన్ – సన్నని తెల్లని తెరలోపల నున్నాడా అని అనిపించేటట్లుగా, మాఘ కృష్ణ చతుర్దశీ మధ్యరజని – మాఘ మాసంలో బహుళ చతుర్దశినాటి అర్ధ రాత్రమునుందు – మహా శివరాత్రినాటి నడిరేయి అగుపించాడు అని ఈ పద్య భావం! హృద్యమైన వర్ణన కదూ! శ్రీనాథుని ప్రతిభంతా ఇలాంటి పద్యాలలోనే కనపడుతుంది. (ఇది చదువుతుంటే ఎందుకో ‘బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను’ అన్న శ్రీశ్రీ మాటలు గుర్తుకొచ్చాయి!)