క్రీడాభిరామము – (4)

kriidaabhiraamam-4

వస్తు నిర్దేశం – అంటే రచనలో ఏ ముఖ్య విషయాన్ని గురించి చదవబోతారో ఆ విషయాన్ని సూచనప్రాయంగా ముందుగానే చెప్పడం…క్రీడాభిరామం వీధి నాటక పధ్ధతిలో చేయబడిన రచన కాబట్టి, నాటకంలో ప్రేక్షకుడు చూడబోయ సంగతులను గురించి సూచనప్రాయంగా చెప్పడానికి ఉద్దేశించిన రెండు పద్యాలలో ఇది రెండవ పద్యం.

“చేర వచ్చివచ్చి దూరంబుగాఁ బోదు
డాయవత్తు దవ్వు పోయిపోయి
మాట లింక నేల మాపాలిటికి నీవు
మాయలేడి వైతి మంచిరాజ!”

మామూలైన మాటలతో మధురమైన బావాన్ని హృద్యంగా చెప్పిన పద్యం ఇది.

“దగ్గరగా వచ్చినట్టే వచ్చి ఇంతలోనే ఎటుపోతావో పోతావు. వెళ్ళిపోయావే అనుకుంటూ దిగులుతో ఉన్నంతలోనే ఇదిగో దాపునే వున్నానుగా అన్నట్లుగా కళ్ళకు కనబడతావు. నీతో పెద్ద గోడవై పోయిందిగా స్వామీ! ఇన్ని మాటలెందుకు…నా పాలిటికి నువ్వొక మాయలేడివైపోయావయ్యా మంచిరాజా!” – అని ఈ పద్యం భావం!

ఇందులోని సౌదర్యమంతా ‘మా పాలిటికి నీవు మాయలేడివైతి మంచిరాజ!’ అనే పోలికలో ఇమిడి వుంది.

You appear too close but leave all at once and go
You come near again after going too far and lost
Why these many words, my dear Mamchiraaja!
To our fate you have become that magical deer!

క్రీడాభిరామము – (3)

kaakatiiya_3

వస్తు నిర్దేశం – ప్రేక్షకులు చూడబోయే సంగతులను సూచనప్రాయంగా తెలియజేసే పద్యం. తెరవెనుకనుంచి వినిపిస్తుంది.

కామమంజరి అనే పెరున్న వేశ్య, ఏదో కారణాన దేశాంతరగతుడైన తన ప్రియుడు, ‘క్రీడాభిరామం’ లో కథానాయకుడు అయిన కాసల్నాటి గోవింద మంచనశర్మను ఉద్దేశించి రాసి పంపిన ప్రేమలేఖను అతని స్నేహితుడయిన టిట్టిభ సెట్టి చదివి వినిపిస్తుండడంతో, అత్యంత రమణీయంగానూ, వ్యంగ్య వైభవంగానూ ఇందులో కథావస్తు నిర్దేశం చేయబడింది. రెండు పద్యాలు ఇవి. మొదటి పద్యం భావం –

“రసజ్ఞ శేఖరా, మధుపా! విరిసిన అరవిందాలున్న ఈ వనవాటికను (రంగురంగుల పూవులున్న, రమణీయమైన వన ప్రదేశాన్ని) విదిలి పెట్టి, చెట్టులంటా పుట్టలంటా (ఆ తిరుగుడులేమిటి?) అడవులలో పడి ఏం దొరికించుకుందామని భ్రమతో తిరుగుతున్నావు? నీ వివేకమంతా ఏమయిపోయింది? పాతబడిపోయిందా…అంటే నశించిపోయిందా?” అని మొదటి పద్యం.

గతి రసికుండ! షట్చరణ! గానకళాకమనీయ! యో మధు
వ్రత! విక చారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి వటవీ ప్రదేశమునఁ జెట్టులఁ జేమలఁ నేమి గల్గునన్
రతి నిటు సంచరించెదవు ప్రాఁబడిపోయెనె నీ వివేకమున్?

Six-footed flyer! Sweet-tongued singer! Oh honey bee!
Why did you discard this place of flowers in full bloom?
And with what expectations do you roam among the
Forest shrubs and trees? Have you lost all your prudence?

క్రీడాభిరామము – (2)

kaakatiiya_2

మహాకవి శ్రీనాథుడు, వల్లభరాయుడు సమకాలీకులని పండితుల అభిప్రాయం. పద్యనిర్మాణంలో శ్రీనాథుడు అనుసరించిన పధ్ధతినే ‘క్రీడాభిరామం’ లో వల్లభరాయుడు చాలా చోట్ల అనుకరించాడు. శ్రీనాథుని అలంకారికమైన, అక్కడక్కడ శృంగారమయమైన, ప్రౌఢమైన పద్యనిర్మాణశైలిని వల్లభరాయుడు బాగా ఇస్టపడ్డాడని ‘క్రీడాభిరామం’ లోని చాలా పద్యాలు చెప్పకనే చెబుతాయి.

రచించబడిన తరువాత కొంతకాలానికి మరుగునపడిపోయి, ఆ తరువాతి కాలగర్భంలో కలిసిపోయి దాదాపుగా అయిదువందల సంవత్సరాలు కనుమరుగైపోయింది ‘క్రీడాభిరామం’. ఈ కావ్యాన్ని గుర్తించి, ఆ స్థితినుంచి వెలుపలికి తీసి మళ్ళీ వెలుగులోకి తెచ్చిన వారు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు. తెలుగుసాహిత్యం మీద మక్కువ, శ్రధ్ధ వున్న వ్యక్తులేవరైనా సరే ఈయన పేరును ఎన్ని సార్లు స్మరించుకుంటే అంత మంచిది. తెలుగులో ‘క్రీడాభిరామం’ కావ్యాన్నే కాక, నన్నెచోడుని ‘కుమారసంభవం’, త్రిపురాంతకుని ‘త్రిపురాంతకోదాహరణం’, బద్దెన ‘నీతిసారముక్తావళి ‘ మొదలైన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రకటించిన వారాయన. తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో క్రీ.శ.1856 లో తిరగరాయబడ్డ ‘క్రీడాభిరామ’ పు తాళపత్ర ప్రతిని గుర్తించి, ప్రాచీనమైన ఆ ప్రతిలోని గ్రంథపాతాలను సంస్కరించి, పరిస్కరించి, అందులోంచి మరొక వ్రాతప్రతిని తయారుచేసుకుని 1909లో ప్రకటించారాయన.

‘క్రీడాభిరామం’ కావ్యం వెలుగులోకి రావడం వలన జరిగిన అతి ముఖ్యమైన సంగతులలో ఒకటి – ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే విషయ ప్రకటనం చేసింది శ్రీకృష్ణదేవరాయలు కాదని, అది వల్లభరాయుడనీ, ఆ కీర్తి నిజానికి వల్లభరాయునికి దక్కాలనీ!

‘క్రీడాభిరామం’ పద్యంలో వల్లభరాయుడు చేసిన original idea ని తీసుకుని ఇంకొన్ని మెరుగులు దిద్ది మరింత relevant గా వేరే పద్యాన్ని కృష్ణదేవరాయలు అందించాడు తన ‘ఆముక్తమాల్యద’ లో!

“జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చుటాఁడుబిడ్డ మేలుగాదె.”

Mother is Sanskrit for all the languages that now exist
Amongst the languages of the land Telugu is the best;
Isn’t the sister-in-law who wishes for well being and wealth
In fact more comforting for a woman than her own mother!

క్రీడాభిరామము -(1)

kaakatiiya_1

తెలుగులో ‘క్రీడాభిరామం’ ఒక విలక్షణమైన కావ్యం. భారతీయ సంప్రదాయంలో దశరూపకాలలో ఒకటైన ‘వీధి’ నాటక పధ్ధతిలో ఈ కావ్యం వ్రాయబడింది. ఈ కావ్యానికి కర్త వినుకొండ వల్లభరాయడు. అయితే, ఇందులోని ప్రతి పద్యంలో కనిపించే శ్రీనాథుని తరహా పద్యనిర్మాణం, భాష, శృంగార పదజాలం ఈ కావ్యం అసలుకి శ్రీనాథుని చేతనే రచించబడి ఏ కారణం చేతనో వల్లభరాయని పేర ప్రచారంపొందిందని ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో ప్రబలంగా ఉండింది. ఒకవైపు పెద్దలలో ఆ అభిప్రాయం అలా ఉన్నప్పటికీ, క్రీడాభిరామం కర్తృత్వం వల్లభరాయనికే ఆపాదించబడి ఇప్పటికీ పదిలంగానే వుంది.

తెలుగులోని పద్యకావ్యాలలో నిజానికి ‘క్రీడాభిరామం’ ఉన్నంత దగ్గరగా మరే కావ్యం ఉండదనే మాట అంత నిజం. సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకునిచే రచించబడిన ‘ప్రేమాభిరామం’ అనే కావ్యాన్ని అనుకరిస్తూ ‘క్రీడాభిరామం’ రచించబడిందని వల్లభరాయడే చెప్పిన మాట. అయితే, ‘ప్రేమాబిరామం’ ఇప్పటికీ లభించనిది కాబట్టి. ఈ అనుకరణ ఎలాంటిదనేది ఇప్పటికీ అస్పష్టమే!

వినుకొండ వల్లభరాయని తండ్రి తిప్పయామాత్యుడు విజయనగర ప్రభువైన రెండవ హరిహరరాయల కొలువులో రాజోద్యోగి అనే అధారాన్ని బట్టి ‘క్రీడాభిరామం’ బహుశా 15వ శతాబ్ది ప్రధమార్ధంలో రచించబడి వుండవచ్చని తేల్చారు. ‘క్రీడాభిరామం’ ఏకాశ్వాస ప్రబంధం. మొత్తం 245 పద్యగద్యలతో చంపూ పధ్ధతిలో చేయబడిన రచన. కాకతీయుల ఓరుగల్లు నగరం, కోట, అందులో ప్రజల వేషభాషలూ, ఆహారాలూ, అలవాట్లూ ఇందులో వర్ణించబడ్డాయి. అయితే, ఇందులో అక్కడక్కడా వర్ణనలలో చోటుచేసుకున్న సభ్యంకాని పదజాలం, వర్ణనా విధానం కారణంగా ఈ మొత్తం రచన చెడ్డదిగానూ, మామూలు పాఠకులకు పఠనయోగ్యమైనది కానిదిగానూ నిర్ధారించబడింది.

సభ్యంకాని, అభ్యంతరకరమయిన వర్ణనలు వున్న భాగాలను మినహాయిస్తే, ‘క్రీడాభిరామం’ నిస్సందేహంగా ఒక విలక్షణమైన రచన. ఆ కాలపు ఏ కవీ ఊహించని కథా వస్తువుతో ఒక కాల శకలాన్ని – కాకతీయుల పరిపాలనా కాలంలోని ఒక రోజును – వాస్తవానికి ఏవిధంగానూ అతీతంగా అనిపించనట్లుండే పాత్రల ద్వారా అక్షరభధ్ధంచేసి చూపించిన రచన. కథానాయకులనదగిన గోవింద మంచనశర్మ, అతని అనుచరుడు (financier) అనదగిన టిట్టిభశెట్టి…వీరిరువురు నడిచే మార్గంలోనే పాఠకుడినిగూడా మానసికంగా నడిపించగలిగేంత ప్రతిభావంతమయిన రచనావిధానంతో ముందుకు సాగుతుంది ఈ రచన. ఆకారణంగా, ఈ కావ్య సౌందర్యమంతా ఈ కావ్యంలోని ప్రతి పద్యంలో, గద్యలో అక్షరాలతో చిత్రించి చూపించిన ఆనాటి కాకతీయ జనజీవనం వుండి పాఠకుని మనోనేత్రాలకు కనబడుతుంది.

కాలగమనంలో మరుగునపడిపోయిన ఈ రచన, మళ్ళీ 1909లో బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి పుణ్యమాని, వారే ప్రచురించిన ‘విస్మ్రుతకవులు’ శీర్షిక పరంపరలో భాగంగా వెలుగు చూసింది. ఆ తరువాత, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి విపులమైన పీఠికతోనూ, వారి కొన్ని సవరణలతోనూ 1928లో ముద్రించబడింది. ఆ తరువాతి కాలంలో ఎమెస్కో వారు వారి ‘సంప్రదాయ సాహితి – 20’ గా స్వర్గీయ బి.వి. సింగరాచార్యగారి ‘సమాలోకనం’ తో 1972లో ప్రచురించారు. ఇవి నాకు తెలిసిన ప్రతులు, చివరి రెండూ నాకు అందుబాటులో వున్నవి. ఇవి కాకుండా స్వర్గీయ బండారు తమ్మయ్య గారి సంపాదకత్వంలో వావిళ్ళవారు ప్రచురించిన ప్రతి 1960నాటిది, శ్రీ బి.ఎన్. శాస్త్రి గారి పీఠికతో నవోదయ సమితి, హైదరాబాదు వారు ప్రచురించినది 1968 నాటిది కూడా వున్నాయి.

ఇందులో అసభ్యత అంటూ ఏమాత్రమూ లేని పద్యాలను సాధ్యమయినంత అందంగా అలంకరించడము, వీలయినంత సౌందర్యవంతంగా భావం చెడకుండా ఆంగ్లంలోకి అనువదించడమూ అనేవి ఈ రచనను ఇంకాస్త glorify చేసే దిశగా నా మనసుకు తోచిన, నేను చాలా కాలంగా అనుకుంటున్న సంగతులు. వరంగల్లులో ఇప్పటి కోట శిథిలాలలో నేను తీసిన ఫోటోలపై, ఇందులో అతి ముఖ్యమైనవిగా అనిపించిన పద్యాలను వుంచి Photo Cards గా చేసి, ఒక abridged edition గా అవసరమైన notes తోనూ ఆంగ్లంలోనికి అనువాదంతోనూ ఈ పోస్టుల పరంపర సాగుతుంది.

***                                                            ***

“గణన కెక్కిన దశరూపకములయందు
వివిధ రసభావభావన వీథి లెస్స
యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రభంధ
మనుచు మీ రానతిచ్చెద రైన వినుఁడు.”

‘క్రీడాభిరామం’ కృత్యవతరణ పద్యం ఇది.

రూపకం అంటే దృశ్య కావ్యం అని అర్ధం. బారతీయ సంప్రదాయంలో దశరూపకాలు ఇవి:
1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంకము, 10. ఈహామృగము.

ఈ పదింటిలో ఎనిమిదవది వీధి. అయితే, ‘వీధి’  నాటక పధ్ధతి ఎంతగా జనాదరణ పొందిందో వేరే చెప్పనక్కరలేదు. వినోదానికైనా, ఒక సందేశాన్ని జనం మనసులలోకి పంపించాలన్నా ఆధునికంగానూ ఈ పధ్ధతినే ఆశ్రయించడం ఇప్పటికీ చూస్తుంటాం.

 Among the much acclaimed ten methods of drama,
Method ‘Street’ capable of exhibiting various emotions
Is without doubt the best, if you order me to reveal
Which great poet authored this Prabandhathen listen.

‘యేమని పలికెనో యేమియు నెఱుగ…’

అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యుడు. ఈయన కుడా సంకీర్తనా చార్యుడే. తండ్రిగారి కున్నంత లలితమైన హృదయం ఇతనిదీని. ఫలితంగా అన్నిటా తండ్రి అంతటి ప్రజ్ఞావంతుడే అనిపించుకున్నాడు ఈయన కూడా! సంకీర్తనలే కాకుండా వచనమాలిక, దండకం, శతకం లాంటి ఇతర ప్రక్రియలలో కూడా రచనలు  చేశాడు.

ఈయనది శృంగార సంకీర్తనలలో ఒకటి భావకవిత్వాన్ని పోలినది వుంది. స్నిగ్ధత్వం, అమాయకత్వం నిండి వున్న ఒక స్త్రీ హృదయపు ప్రేమ రాగ రంజితమైన అంతరంగాన్ని సామాన్యమైన మాటలతో సూటిగా తెలియజెబుతుంది ఈ పదం. సాంప్రదాయికమైన నాయికలలో ఈమె ‘ముగ్ధ ‘ అని పేర్కొనబడుతుంది.

Mugdha
“మచ్చి కెఱుగుదు గాని మనసెఱుగ, నిన్ను
మెచ్చు టెఱుగుదు గాని మీదేమి నెఱుగా …      /పల్లవి/

కామించి పతిరూపే కనుటెరుగుదు గాని
ఆ మీదటి పనులవి యెఱుగా
నా మో మతడు చూచి నవ్వుటెఱుగుదుగాని
యేమని పలికెనో యేమియు నెఱుగ…”       /చరణం/

ఇందులో భాష పరంగా అర్ధంకాక పోవడానికి ఒక్క కఠినమైన పదం కూడా లేదు. అన్ని సామాన్యంగా వింటూండే పదాలే! అయితే భావం పరంగా విడమరిచి చెప్పాలంటేనే కష్టం. అర్ధమయిన వాళ్ళకి ‘ఆహా ఎంత బాగా చెప్పాడు!’ అనిపిస్తుంది. అర్ధంకాని వాళ్ళకి .. ఆ ఏముంది ఇందులో? అనిపించినా అనిపించవచ్చు….చెప్పలేం!

అందువలన, తెలుగులో మళ్ళీ ఈ పంక్తుల భావాన్ని మళ్ళీ రాయడం అనవసరం . కనుక, ఆంగ్లంలోకి తర్జుమా చేసి చూద్దామనిపించింది.  దాని ఫలితమే ఈ క్రింది స్వేచ్చానువాదం అన్నా, భావానువాదం అన్నా…ఏదని అన్నాను!

“I feel the intimacy
But I don’t understand His mind
I like to praise Him always
More than that I don’t know anything…

With longing in heart I know how to visualise Him
But I don’t know the deeds that shoud follow
I feel the pleasure when he looks at my face and smile
But then, I don’t remember a word of what all he spoke!”

పై పదంలోని భాషనూ, భావాన్ని, పెదతిరుమలయ్య ఆశించిన, ఉద్దేశించిన దానితో పొలిస్తే, ఈ ఆంగ్లానువాదంలో చెడగొట్టలేదని మాత్రం అనుకుంటాను!

పదాంగుటము…పురుష విరహమూ…

bfly_from top_1A

“తలచిన హృదయము ఝల్లను తరుణీమణి ఒయ్యారము
కలిగీనా ఇక నొకపరి కన్నుల జూడగను…

మో మరవాంచి పదాంగుటమున నిల నొయ్యన వ్రాయుచు
కోమలి కన్నీ రెడనెడ గ్రుక్కుచు రెప్పలను
వేమరు నా దెస చూచుచు వీడగ నొల్లని భావము
ఏమని తలపోయుదు విధి నేమని దూరుదును….”

అన్నమయ్య శృంగార కీర్తనలలోనిది ఇది. ఇందులోని భావం:

“ఆ అందగత్తె  ఒయ్యారాన్ని  గుర్తుచేసుకుంటే హృదయం ఝల్లుమంటుంది
మళ్ళీ ఒక్కసారన్నా ఆ ఒయ్యారాన్ని చుసే భాగ్యం ఈ కళ్ళకు కలుగుతుందా….

వదనాన్ని సంగంవంచి పాదం బొటనవేలుతో నేల మీద అదేపనిగా రాస్తూ
కన్నీరు అమాంతంగా ఉబికివస్తున్నా ఆమె  రెప్పల అడుగుననే వాటిని దాచేస్తూ
వెయ్యిసార్లు నా వంకకే చూస్తూ విడిచి వెళ్ళడానికి ఇష్టపడని ఆ భావాన్ని
ఏమని నేను గుర్తుచేసుకోను, విధిని ఏ మాటలతో నేను దూషించను…..”

తెలిసిన భావచిత్రమే కదా ఇది! ఎన్ని చిత్ర లేఖనాల్లో, ఎన్ని సినిమాల్లో, ఇంకా ఎన్నెన్ని పాటల్లో బహుశా ఒక్కొక్క generation కి ఒకసారి మళ్ళీ మళ్ళీనూతనంగా  పుట్టుకొస్తూ, వ్యక్తమవుతూ వస్తున్న భావచిత్రం ఇది! అన్నమయ్య వ్యక్తీకరించింది ఇందులో పురుష విరహం. అన్నమయ్యది క్రీ.శ. 15వ శతాబ్దం. నేను చదివినంత వరకు,  నా దృష్టికి వచ్చినంత వరకు ఈ భావ చిత్రాన్ని మొట్ట మొదటగా వ్యక్తీకరించింది అన్నమయ్యే! అంటే ఎంత కాదన్నాసాహిత్య చరిత్రలో  ఈ భావ చిత్రానికి  first recorded instance  ఈ పదంలో అన్నమయ్యది….కనుక ఈ మాటలలో ఈ భావ చిత్రానికి 500 ఏళ్ళ వయసు! అయినా, ఇది ఎప్పటి కప్పుడు నిత్య నూతనమవుతూ ఈ అయిదు శతాబ్దాలుగా మళ్ళీ మళ్ళీ వినబడుతూ కనబడుతూనే వుంది. ఇకముందూ కనబడుతూనే వుంటుంది కూడా! ఎందుకంటే, పై ఫోటోలోని natural phenomenon లాగా, లలితమైన పురుష హృదయం అనేది ఉన్నంత కాలం  ఈ భావానికి కాలం చెల్లడం అనేది ఉండదు కాబట్టి!

బాష పరంగా ఇందులోని అరవంచు (ముఖాన్ని నేల వైపుకు సంగంగా వంచడం), పదాంగుటము (పాదపు బొటనవ్రేలు) – ఇవి వినసొంపుగా వుండే అచ్చమైన తెలుగు మాటలు! అందునా ముఖ్యంగా ‘పదాంగుటము’ అనే మాట – ఈ శృంగార కీర్తనలోని ఒయ్యారమంతా ఆ పదంలోనే ఉన్నట్లు నాకనిపిస్తుంది.

తెలుగు మాట – (1)

శతాబ్దాలుగా తెలుగు భాష వుంది. హాలుని గాథా సప్తశతి కాలానికే,  అంటే క్రీస్తు శకారంభ కాలం నుండే తెలుగు భాషలోని కొన్ని పదాలు ప్రాకృతంలోకి వెళ్ళ గలిగేంతటి స్పష్టమైన, బలమైన వాడుక భాషగా తెలుగు ఎదిగిందని క్రీ.శే. తిరుమల రామచంద్ర గారు తమ ‘గాథాసప్తశతిలో తెలుగు పదాలు’ అనే వ్యాసంలో (భారతి  మే, 1948) నిరూపించారు. క్రీ.శ.1 వ శతాబ్దానికే అలా వున్న భాషలో  క్రీ.శ. 11 వ శతాబ్ది దాక లిఖిత సాహిత్యం లేదు. అంటే దాదాపు ఒక సహస్రాబ్ద కాలం పాటు అంత బలంగా వాడుకలో వుండి, వేరే భాషల మీద కూడా ప్రాభావాన్ని చూపగలిగే స్థాయిలో వున్న తెలుగులో లిఖిత సాహిత్యం ఎందుకు రాలేదో అంత సులభంగా అర్ధం కాదు.

అదలా వుంచితే, క్రీ.శ. 18వ శతాబ్దం వాడనుకుంటూన్న అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంసవింశతి ‘ లో వాడిన కొన్ని తెలుగు పదాలకు అర్ధం గురించి మాట్లాడుతూ C.P. బ్రౌన్ గారు’ హంసవింశతి’ లోని పలుకుబళ్ళు కొన్ని అప్పటికే (అంటే క్రీ.శ.1820 ల  ప్రాంతానికే – బ్రౌను దొర కడపలో వుండిన సంవత్సరాలు) ప్రచారంలో లేవనీ, కాబట్టి తమ నిఘంటువులో కొన్నిటికి అర్ధం తెలియలేదనీ వ్రాశారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు క్రీ.శ. 18 వ శతాబ్దం ఉత్తరార్ధంలో వాడని అనుకుంటున్నారు గనుక, ఈ మాయమవడం అనేది అంతా 50-60 ఏళ్ళ మధ్య కాలంలోనే జరిగిందంటే ఆశ్చర్యమూ, తెలుగు భాషకు ఇది ఒక దురదృష్టకరమైన పార్శ్వమూ అనుకోవాల్సి వుంటుంది.

అలాగా, మనకు (వాడుకలో) వున్న మాటల కంటే, (వాడుకలో లేకుండా) పోయిన మాటలు శతాబ్దాలు గడిచేకొలదీ ఎక్కువవుతూ వచ్చాయి  అనిపిస్తుంది. ఆ వంతున, క్రీస్తు శకారంభ కాలం నుంచి ఇప్పటి దాకా తీసుకుంటే, ఈ రెండువేల సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని మాటలు వాడుకలోంచి జారిపోయాయో లెక్కకట్టుకుంటే, ఏ కారణాల వల్లనైతే నేమి మనం వదిలేసుకుంటూ వచ్చిన పదజాలం (vocabulary) దాదాపుగా ఒక 30 శాతం దాకా వుంటుందేమో అని నా కనిపిస్తుం టుంది. ఇది ఉజ్జాయింపుగా నేను అంటున్న మాట. ఎక్కువో తక్కువో భాషలో అధికారికమైన  జ్ఞానం కలవాళ్ళు చెప్పాలి.

పెద్దలు చెప్పినట్లు, ఒక భాషలో ఏ మాటయినా మొదట శబ్దం, తరువాత అర్ధం, ఆ తరువాత రసము, అలంకారము, చందస్సు ఇంకా వ్యాకరణం. భాషలో మాటలకు సంబంధించి ఈ అన్ని అంశాల సమగ్ర జ్ఞానం కలిగి వుండడం ఆ భాషకు సంబంధించి పరిపూర్ణ జ్ఞానం కలిగి వుండడం అవుతుంది.

భాషలోని మాటలకు సంబంధించి ఈ అన్ని అంశాలపై ఒక మేరకు జ్ఞానాన్ని కలిగింపజేసేవి నిఘంటువులు. చాలా కాలం దాకా తెలుగులో మనకు మూడు ముఖ్యమైన నిఘంటువులు వున్నాయి. వాటిలో మొదటిది బ్రౌన్ నిఘంటువు. రెండవది శబ్దరత్నాకరం. మూడవది శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఇప్పుడు మాండలిక పదకోశాల నిర్మాణం జరిగాక ఆయా ప్రాంతాలకు సంబంధించిన పదజాలాన్ని చేర్చుకున్న నిఘంటువులు కొన్ని వచ్చి చేరాయి. అయితే, మొత్తం భాషకు సంబంధించి వాడుకలో అర్ధానికిగాని, సాహిత్య పరంగా గానీ ఇప్పటికీ బ్రౌను నిఘంటువుది ప్రత్యేకమైన స్థానం అని ఒప్పుకోవాలి.

పాటను సాహిత్యంగా గుర్తించి తమిళులు పురాతన సాహిత్యం కలవాళ్ళయితే, అది చేయక మనం లేని వాళ్ళమయ్యాం అని ఒకచోట కీ.శే. ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటం లో) అన్నారు. అలా, అన్నమయ్యను గురించి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 1920-30 లలో శ్రీ వేంకటేశ్వర దేవాలయంలోని స్వామివారి హుండీ గుమ్మానికి పక్కగా వున్న దక్షిణపు ఆవరణలోని  అన్నమాచార్యుల సంకీర్తన భాడారంలోని రాగిరేకులను పైకి తీయించి, వాటిలోని సంకీర్తనలను కీ.శే.లు వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గార్ల సహాయంతో పరిష్కరించి అనేక సంపుటాలుగా వేయించిన దాకా మనకు తెలీదు. వేల వేల సంకీర్తనలలోని అప్పటి భాషను, నుడికారాన్ని చేలా తేలికగా మనకు సంబంధం లేనివన్నట్లుగా వదిలేశాం, మర్చిపోయాం!

ఆ తరువాతి కాలంలో శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర గారి సంపాదకత్వంలో ‘తాళ్ళపాకవారి పలుకుబళ్ళు’ అని ఒక ఐదారు వందల పేజీల గ్రంథం ,’అన్నమయ్య పదకోశం‘ అని శ్రీ రవ్వా శ్రీహరి గారి ఇంకో ఆరేడువందల పేజీల నిఘంటువు  అవసరమయ్యాయి (ఇప్పటికి నాకు తెలిసినంత వరకు) అన్నమయ్య వాడిన తెలుగుభాషలోని ఆ కాలపు (క్రీ.శ.15 వ శతాబ్దం) నుడికారాన్ని ఇప్పుడు సవివరంగా అర్ధం చేసుకోవడానికి అంటే అప్పుడు వాడుకలో వుండిన ఎంత భాష (vocabulary) ఇప్పుడు లేకుండా పోయిందో అర్ధమవుతుంది గదా!

అదలా వుండగా, ఇప్పటికీ అన్నమయ్య పదాలలోని మాటలకు అర్ధాలను చెప్పుకోవడంలోనూ, భావాన్ని అన్వయించుకోవడంలోనూ పూర్తి స్పష్టత లేని సందర్భాలు ఇంకా వున్నాయనే నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఈ సంకీర్తన పల్లవి లో:

“అయ్యో పోయెం బ్రాయము కాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి…”

‘ముయ్యంచు’ అనే మాట.ఈ మాటకు అర్ధం శ్రీ రవ్వా శ్రీహరి గారి ‘అన్నమయ్య నిఘంటువు’ లో ‘ధర్మార్ధ కామములనే మూడు అంచులు గల మనసు’ అని సూచించబడింది.

మూడు + ఏరు = ముయ్యేరు (గంగా నది) అయినట్లుగా, మూడు + అంచు = ముయ్యంచు అయింది. అంత దాకా బాగానే వుంది. అయితే ఇందులోని అంచులు ఏవి అనే దగ్గరే అసలు సంగతంతా వుంది. ధర్మార్ధ కామములని మూడు అంచులు అని అనుకుంటే, మోక్షమనే నాలుగో అంచు కూడా ఉండాలి గదా, అది ఎందుకు అన్నమయ్యచేత వదలబడింది అని సందేహం కలుగుతుంది.  అసలుకు ఈ ధర్మార్ధ కామ మోక్షములనేవి మనసుకు అంచులు అవుతాయా? ‘అంచు’ అనే మాట అక్కడ సందర్భాన్ని బట్టి నిందార్ధంలో కదా వాడబడింది?  ఆ అర్ధంలో ధర్మార్థకామములను మనసుకు ఆపాదించటం సాధ్యమవుతుందా? ఒక వేళ సాధ్యమవుతుం దనుకున్నా, నాలుగో దయిన  మొక్షాన్ని కలుపుకుని కదా చెప్పుకోవాలి? అదెందుకు ఇక్కడ వదిలివేయబడింది? ఇలాంటి సందేహాలు రాక మానవు. అందువలన ఈ ‘ముయ్యంచు‘ అనే మాటలోని మూడు అంచులు ధర్మార్ధ కామములను సూచించవని నా అనుమానం.

మరయితే, ఈ మాటకు ఇక్కడ పొసిగే అర్ధం ఏమై ఉండాలి? అనుకున్నపుడు, ఇందులో అన్నమయ్య ఉద్దేశించింది  ధర్మార్ధ కామములనేవి కాక, కామ క్రోధ లోభములనే  మూడు ముఖ్యమైన అవలక్షణాలనీ…అలా  ‘కత్తులవంటి ఈ మూడు అవలక్షణాలు నిండి వున్న మనసుతో లోకాన్ని చూస్తూ, ప్రవర్తిస్తూ ఇన్నాళ్ళుగా నేను మొహమతినై వున్నానే’ అని అన్నమయ్య ఇందులో మొఱపెట్టుకున్నది అని నాకు తోస్తుంది.

ఇప్పుడు ఈ సంకీర్తన పూర్తి పాఠం ఒకసారి చదువుకుంటే –

“అయ్యో పోయెం బ్రాయము కాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి…

చుట్టంబులా తనకు సుతులు, కాంతలు చెలులు
వట్టియాసం బెట్టువారే కాక
నెట్టుకొని వీరు కడు నిజమనుచు హరినాత్మ
బెట్టనేరక వృథా పిరివీకులైతి…. అయ్యో….

తగు బంధులా తనకు తల్లులును తండ్రులును
నగలబెట్టుచు తిరుగువారేగాని
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడనైతి….అయ్యో…”

ఇందులో మిగతా భాగం, అంటే చరణాలున్న భాగం గురించి మరొక పోస్టులో.

ఇక్కడ ఒక మాట. పెద్దలు, శ్రీ రవ్వా శ్రీహరి గారు సూచించిన అర్ధంతో ఇందులో విబేధించడమన్నది నా తెలివితేటలు ప్రదర్శించికోవడానికి ఎంతమాత్రం కాదు. ఈ సాహిత్య సంబంధ విషయాలలో వారికి వున్న ప్రజ్ఞలో నాకు సహస్రాంశం కూడా లేదు. ఇది కేవలం సరయిన అర్ధం అన్వయం కోసం చేసిన ప్రయత్నమే తప్ప వేరు కాదు. ఈ రాతలో ఎక్కడయినా వాడకూడని మాట వాడినట్లుగా అనిపిస్తే, అది తెలియక జరిగినదిగా పెద్దలు, పెద్దమనసుతో మన్నిస్తారని ఆశిస్తాను.

లాలి (జోల) పాట!

DSC00711-A

తెలుగిళ్ళలో అమ్మలకి లాలిపాట అంటే మొట్ట మొదటగా గుర్తుకు వచ్చేది అప్పటికీ ఇప్పటికీ ‘చందమామ రావె, జాబిల్లి రావె ‘ పాటనే!
తొలుతగా ఏ అమ్మ అమృతచిత్తం నుంచి ఆ పాట రూపుదిద్దుకుందో గాని, అజరామరమై నిలిచిపోయింది.

నిండు పున్నమి రాత్రి, వెన్నెల, చల్లని ఆ వెలుగులో కొబ్బరాకుల మధ్యలోంచి తొంగి చూస్తున్నట్లుండే చందమామ,
జాబిల్లి…ఇదొక మరుగైపోయిన వాతావరణం; మారుతున్న పరిస్థితులలో చేసేది లేక అనుకున్నా, మనసుల్లోంచి తుడిచివేసుకోబడిన చిత్రం.

అయితే, భౌతికంగా, మరీ పట్టణాల్లోని అపార్టుమెంటు ఇళ్ళలోంచి  ఈ చిత్రం మాయమైనా, ఈ చిత్రానికి లంకె వేయబడి ఉన్న ఈ
లాలిపాట మాత్రం ఇప్పటికీ అవసరమైనప్పుడల్లా అమ్మలను ఆదుకుంటూనే వుందనుకుంటాను.

తెలుగులో లాలి పాట (లేదా జోల పాట)లను గురించి అనుకుంటూ ఈ మధ్య పుస్తకాలు తిరగేస్తుంటే,
ఎప్పటిదో (ఇప్పుడు లేని) భారతి మాసపత్రిక పాత సంచిక ఒకదాని నుంచి రాసిపెట్టుకున్న ఒక లాలిపాట కంటపడి అనందాన్ని కలగజేసింది. 

చందమామ రావే…’  పాటకు ఏమాత్రం తీసిపోనట్లుండే ఆ పాట పాఠం:

“బూచివాడా! రార, బుట్టల్లుకోని
బుట్టలో అమ్మాయిని పట్టేసుక పోర!
లొడలొడా లొట్టీ, తాటాకుల బుట్టీ
మీ యత్త మెడ గట్టీ ఊరెళ్ళగొట్టీ.
దోరదోరల పండు దోరరిటిపండు
పచ్చ దోరల పండు పాపాయి మాకు.
అందరీ మామల్లూ చందమామల్లు;
అమ్మాయి మామల్లూ రామలక్ష్మణులు!
చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అమ్మాయి చెలరేగి మామ భుజమెక్కు!
మామ భుజమెక్కుతూ మామ నే మడుగు?
పాల్దాగు గిన్నడుగు, పాడావు నడుగు!
హాయి! మా యమ్మాయి నీళ్ళు దే బోతె,
నీళ్ళారి కన్నెలూ తోడుందుర మ్మా!
హాయి, హాయీ, హాయి! ఆపదలు గాయి!
చిట్టి తల్లిని గాయి! శ్రీ రంగ శాయి!”

మంజరీ ద్విపద అనదగిన చందంలో ఉందీ గేయం. పాటంతా అచ్చమైన  తెలుగు పదాలు, స్వచ్చ్చమైన తెలుగిళ్ళ వాతావరణం!
దోరరటి పండు, పచ్చదోరల పండు లాంటి మేని చాయ…ఏం పోలిక!! అమ్మాయి మామలు రాంలక్ష్మణులు అని – వాళ్ళకూ
అప్పుడూ, ఎప్పుడూ రామలక్ష్మణుల్లా కలిసుండమని సూచన (suggestion)!

మామ భుజ మెక్కుతూ ‘పల్దాగు గిన్నడుగు, పాడావు – పాడి ఆవు నడుగు’! అమ్మాయి పెద్దదై, నీళ్ళు తేవడానికి పోతే,
నీళ్ళారి కన్నెలు – స్నానం చేయడానికి వెళ్ళిన కన్నెలు, తోడుంటారని భరోసాగా చెప్పడం అప్పుడే!

పాట మొత్తంగా ఒక అందమయిన, ఆత్మీయమైన, భద్రమైన స్థితిని మనసులో ఊహిస్తూ మాటలతో కళ్ళకు కట్టినట్లుగా చూపిన
అందమయిన చిత్రం. ఇలాంటి చిత్రాలు పాటలుగా పసితనంలోనూ, చిన్నతనంలోనూ ఎన్ని ఎక్కువసార్లు చెవులకు సోకుతాయో, అంత
ఎక్కువగా ఆ పసి హృదయం మానవీయంగానూ, ఆత్మీయంగాను  రూపుదిద్దుకోవడానికి అవకాశం వుంటుంది.

అజీతా స్స్యామ శరద శ్శతం!

“….బతకడంకోసం బతకడం గొప్పేమీ కాదు. ఇలాంటి బతుకుగురించే, అకర్మణ్యతను గురించే,

“ఉడుముండదె నూరేండ్లును?
  పడియుండదె పేర్మి పాము పదినూరేండ్లున్?
  మడుగున కొక్కెర యుండదె?
  కడు నిల పురుషార్ధపరుడు కావలె…..”

అన్నాడు సుమతి శతకకారుడు. పురుషార్థపరత పూర్ణారోగ్యం లేనిదే సాధ్య పడదు.  కనుకనే మన పూర్వీకులు

“పశ్యేమ శరద శ్శతం
జీవేమ శరద శ్శతం
నందామ శరద శ్శతం
భవామ శరద శ్శతం
ప్రబ్రవామ శరద శ్శతం
అజీతా స్స్యామ శరద శ్శతం!”

ఊరకే ఏదో జీవఛ్ఛవంలాగ బతకడం కాదు; నూరేళ్ళూ చూద్దాం.  నూరేళ్ళూ జీవం తొణికిసలాడుతూ ఉందాం.  నూరేళ్ళూ సంతోషిద్దాం.  నూరేళ్ళూ మోదంతో ఉందాం.  నూరేళ్ళూ ఉందాం.  నూరేళ్ళూ మాట్ల్లాడుతూ ఉందాం.  అన్నిటికన్నా మించి, నూరేళ్ళూ ఒకరికి లొంగకుండా ఉందాం – అని కోరుకున్నారు.

…నూరే ఎందుకు? కృష్ణభగవానుడు 108 సంవత్సరాలు జీవించాడని, ఇతరుడనే ఋషికుమారుడు మహీదాసుడు మృత్యువును నిలువుమని 116 సంవత్సరాలు జీవించాడని (మహీదాస ఐతరేయః….సహషొడశం వర్షశత మజీవత్) ఛాందోగ్యం చెప్పినట్టు ….”

ఎప్పటివో  ‘భారతి’ పాత సంచికలో చదివి నోటుచేసుకున్న మాటలు…బాగున్నై అనిపించి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాసి వుంచడం జరిగిందన్నమాట! ఎందుకు అంటే? మంచి మాటలు గనక, ఎన్ని సార్లు తిరగరాసినా తప్పులేదనీ….ఇలాంటి మాటల్ని కొత్తవాటిని చెప్పగలిగే సామర్ధ్యం ఏలాగూ లేదు గాబట్టి, కనీసం ఆ మాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుని, మననం చేసుకుందామనీ!

‘గాథా సప్తశతి’ నుండి – 3: Lateral thinking

Lateral thinking అనేది ఏంతకీ తెగని సమస్యలకు పరిష్కారాలను సాధించుకోవడానికి అనుసరించ దగిన ఆలోచనా విధానాలలో ఒకటిగా పరిగణనలోకి ఆధునిక కాలంలో వచ్చింది. తెలుగులో దీనికి సమానార్ధక పదం, లేక పదాల సముదాయం ఏమిటో ప్రస్తుతానికి నాకు తట్టడం లేదు. అయితే, మనకు చాల కాలంగా  ‘అటునుంచి నరుక్కు రావడం’ అనే మాట ఒకటుంది.  అది దీనికి సరిపోతుందనుకుంటాను.

ఈ ఆలోచనా పధ్ధతిని ఇదిగా గుర్తించి ఈ పేరు పెట్టిన వ్యక్తి Edward de Bono, ఒక Maltese physician, thinker – born on 19th May, 1933! 1967 లో ఆయన ఈ మాటలకు రూపకల్పన చేసి చెప్పాడు. ఈ రకపు ఆలోచనా పధ్ధతికి ‘మామూలు కంటె భిన్నంగా ఆలోచించడం’ అని ఒక సాధారణ నిర్వచనం  చెప్పుకోవచ్చు. కానీ, Lateral thinking పధ్ధతిలోని సారాన్ని మొత్తాన్ని వడపోసి ఒకచోట చేర్చి చెప్పినదనదగిన ఒక మంచి నిర్వచనాన్ని, వ్యాఖ్యను ఆయన చెప్పి లోకం ముందు పెట్టాడు. అది  – You cannot dig a hole in a different place by digging the same hole deeper! దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక సమస్యకు పరిష్కారం కోసం ఒక దిశలో అదేపనిగా ప్రయత్నించడం అనేది,  ఆ దిశను వదిలి వేరే దిశలో ప్రయత్నించడం అంత ఉపయోగకరం కాకపోవచ్చు అని! సరే, ఇదంతా సమస్యలు, పరిష్కారాలకు సంబంధించిన సంగతి. మరి దీనికీ ‘గాథా సప్తశతి’ కి  సంబంధం ఏమిటి? అంటే, కవిత్వం చెప్పడంలో ఇలాంటి ఆలోచనా పధ్ధతిని ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయా అన్న సందేహం కలిగినపుడు, నాకు మొదటగా జ్ఞప్తికి వచ్చేది ‘గాథా సప్తశతి’ లోని ఈ గాథ!

‘సహి సాహసు సభ్భావేణ పుచ్ఛిమో కిం అసేస మహిలాణమ్,
బడ్డంతి కరఠ్ఠిఆ వ్విఅ వలఆ దఇఏ పఉట్టమ్మి.’

(శతకం 5 – గాథ 53)

‘సఖి కథయ సద్భావేన పృచ్ఛామః  కి మశేష మహిలానామ్,
వర్ధంతే కరస్థితా ఏవ వలయా దయితే ప్రోషి తే.’

(పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ)

‘ఎంత అమాయకురా లీమె? భర్త పరదేశం వెళ్ళాగానే బెంగపడిపోయి, తామరతూడులాగా వసివాడి పోయింది. చెలికత్తెను అడుగుతుంది గదా – భర్తలు దూరం వెళ్ళగానే ప్రతి వనిత చెతిలోని గాజులూ ఇలాగే పెరుగుతాయా? – అని. బాగుందమ్మా బాగుంది. ఇలా అడక్కు. ఎవరైనా వింటే నవ్వుతారు!’

(పై ప్రాకృత గాథకు సహృదయులు, పూజ్యులు తిరుమల రామచంద్ర గారి వివరణాత్మక వ్యాఖ్య).

దీన్ని గురించి ఇంకేమయినా చెప్పాలా? ఏమో, ఏం చెప్పాలి?

చెప్పుకుంటే, చిక్కి శల్యమయిపోతున్న శరీరాన్ని వదిలి, దృష్టిని చేతులకున్న గాజుల మీదికి మళ్ళించి అవి  పెరిగి పెద్దవవుతున్నట్లుగా ఊహించుకుని  విస్తుపోతున్న ఆ స్త్రీ హృదయపు అమాయకత్వాన్ని అంత అందంగానూ ఊహించి ఆవిష్కరించిన ఆ అజ్ఞాత ప్రాకృతకవి హృదయ సౌందర్యాన్ని గురించి చెప్పుకోవాలి. ఇంత హృద్యమయిన కవిత్వానికి వీలు కల్పించే Lateral thinking ని గురించీ చెప్పుకోవాలి!

‘గాథా సప్తశతి’ నుండి – 2

‘సహి ఈరిసివ్వఇ గ ఈ మా రువ్వసు తంస వలిఅ  ముహ అందం,
ఏఅణ బాలవాలుంకి తంతు కుడిలాణ పేమ్మాణం!’                   (శతకం 1, గాథ 10)

‘సఖి ఈదృశ్యేవ గతిః మారోదీః తిర్యగ్వలిత ముఖ చంద్రం,
ఏతేషాం బాల కర్కటీ కుటిలానాం ప్రేమ్ణామ్.’                              (పై ప్రాకృత గాథకు సంస్కృత ఛాయ)

ప్రణయ కలహంతో పెడమొగం పెట్టిన నాయికను ప్రణయాభిముఖనుగా చేయడానికి చెలికత్తె ఇలా అంటున్నది: “సఖి, ఎందుకలా పెడమొగంతో కన్నీళ్ళు కుక్కుకుంటున్నావు? ప్రేమ, వాలుంకి పిల్ల కాళ్ళవలె దగ్గర వున్నవారిని చుట్టుకుంటుంది. కొంచెం లాగితే, వాటివలెనే ముక్కలు, ముక్కలుగా విరిగి పోతుంది.”

  (పై గాథకు పూజ్యులు తిరుమల రామచంద్రగారి అర్ధ వివరణ).

“ఎంత సున్నితం ఈ ప్రేమ నిండిన హృదయం!
ఇంతలో ఆ చందమామ లాంటి ముఖాన్ని
అంతగా ఆ వంకకు తిప్పేసుకుని
అంతలేసి కన్నుల నిండుగా ఇప్పుడు ఈ కన్నీరెందుకని!!

ఒల్లెంకకూన కాళ్ళవంటిదిగదూ ఈ ప్రణయం అనేది!
దగ్గరయిన వ్యక్తిని ఆవాటుగా చుట్టుకుని మురుస్తుంది.
ఇదేవిటి ఈ బంధమని విదిలించి కొట్టామా
పుటపుట విరిగి ముక్కలవుతుందని తెలియని దానవా  చెలీ!!”

                                                                         (పై వివరణ సహాయంతో, నేను మక్కువపడి  చేసుకున్న తెనుగింత).

ఈ గాథను చెప్పిన కవి పేరు ‘అలఅస్స’ అట; అదృష్టవంతుడు!  ఎంత అదృష్టవంతుడు కాకపోతే, కేవలం రెండు లైన్ల కవిత్వంతో రెండువేల సంవత్సరాలుగా తన పేరును నిలుపుకుని వుండగలుగుతాడు!

‘గాథా సప్తశతి’ నుండి -(1)

“అవ్వో సోచ్చే అ ఛణో తేణ విణా గామడాహో వ్వ”  (శతకం 6, గాథ 35)

“దుఃఖం స ఏవ క్షణః తేన వినా గ్రామదాహ ఇవ” (సంస్కృత ఛాయ)

“అతడు లేకపోయిన ఉత్సవం ఊరిలో నిప్పంటుకున్నట్లుగా వుంది” (స్వర్గీయ తిరుమల రామచంద్ర గారి తెలుగు అనువాదం)