ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము : శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి రేడియో ప్రసంగాల సంకలనం.
అయిదవ ప్రసంగం : కళింగము – గాంగయుగము
శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి ఈ రేడియో ప్రసంగాల సంకలనంలో అయిదవ ప్రసంగం కళింగదేశాన్ని రమారమి క్రీ.శ.500 ప్రాంతం నుంచి 1437 దాకా, అంటే దాదాపు తొమ్మిదిన్నర శతాబ్ధుల కాలం పాటు అవిఛ్ఛిన్నంగా పాలించిన గంగవంశపు రాజులకు సంబంధించినది. ఈ ప్రసంగంలోని విషయం సంగ్రహంగా:
మధ్యాంధ్రదేశంలో తూర్పుజిల్లాలలోని పిఠాపురం మొదలుకుని ఉత్తరంవైపు మహానది దాకా వ్యాపించిన దేశాన్ని కళింగం అంటారు. కళింగానికి ఉత్తరంవైపు ఉండే దేశం ఉత్కలం, అంటే ఓడ్రదేశం, ఒరిస్సా. ఉత్తర కళింగము అనే పదమే వాడుకలో ఉత్కలము అనే పదంగా మారిందని భాషాశాస్త్రం తెలిసినవారంటారు. కళింగదేశపు పూర్వచరిత్ర తలచుకోగానే ముందు మనకు జ్ఞాపకం వచ్చేది దంతపురం – కళింగదేశ రాజధాని. బుధ్ధుని నిర్యాణానంతరం ఆయన దంతాన్ని తీసుకువచ్చి ఇక్కడ అందమైన స్తూపంలో పదిలపరిచారట. ఆ కారణంగా దంతపురానికి ఆ పేరు వచ్చింది. పూర్వకాలంలో కళింగదేశ ప్రజలు, ఏలిన రాజులు బౌధ్ధాన్ని అనుసరించినవారే. బౌధ్ధం తరువాత జైనం కూడా ఈ దేశంలో వ్యాపించింది. కాని ప్రబలలేదు. జైనాన్ని మొట్టమొదట ఆదరించినవాడు, శాతవాహనరాజు శ్రీశాతకర్ణికి సమకాలికుడు అయిన ఖారవేల మహారాజు. ఇతడు చాలా పరాక్రమవంతుడు. మగధ రాజ్యం మీదికి ఎన్నో తడవలు దండెత్తివెళ్ళి ఆ మహారాజును ఓడించి తరిమివేసినవాడు. ఇతడు జైనమతాభిమాని. ఓడ్రదేశంలోని పూరీ జిల్లాలోని ఉదయగిరి, ఖండగిరి కొండలను తొలిపించి సుందరమైన గుహాలయాలను నిర్మింపజేసి జైన సన్యాసులకు సమర్పించాడు. ఇతని తరువాత కళింగదేశాన్ని పాలించిన వారు ఇతనంతటి పరాక్రమవంతులుకారు, జైనమతాభిమానులూ కారు. అందువలన ఖారవేలమహారాజు తరువాత జైనం కళింగదేశంలో పూర్తిగా అంతరించకపోయినా ప్రబలలేదు.
కళింగదేశమంతా కొండల, అడవుల మయం. ఇది యావత్తూ సముద్రపు ఒడ్డున ఉన్న దేశం. అందువలన అడవులు, కొండలు, సముద్రము – ఈ మూడిటి ప్రభావమూ కళింగదేశ చరిత్రమీద కనబడుతుంది. కొండల మధ్య లోయలలోనూ, సముద్రతీరపు పల్లపు ప్రదేశాలలోనూ బలము, ప్రతాపము కలవారు చిన్నచిన్న రాజ్యాలను స్థాపించుకుని తమకు వశమైన ప్రాంతాన్ని పాలిస్తూవుండేవారు. కళింగదేశం ఈ విధంగా ఉన్న అదనుచూసుకుని గుప్తవంశజుడైన సముద్రగుప్త చక్రవర్తి క్రీ.శ.350 ప్రాంతాన దండెత్తి వచ్చి, కళింగాన్నే కాక కంచివరకూ తూర్పు సముద్రతీరాన రాజ్యంచేసే రాజులందరినీ వోడించాడు. సముద్రగుప్తుని ఈ దండయాత్ర ఒక పెనుతుఫానులాగా దేశాన్ని భీభత్సం చేసినా అది ఎక్కువకాలం నిలవలేదు. శీఘ్రకాలంలోనే దేశం మళ్ళీ తేరుకుని, కుదుటపడి ఎప్పటిలాగే చిన్నరాజ్యాల పాలన సాగింది. సముద్రగుప్తుని దండయాత్ర జరిగిన నూరునూటయాభై సంవత్సరాలకు కళింగదేశంలో అడుగుపెట్టారు గంగవంశపు రాజులు.
సముద్రగుప్తుడి దండయాత్రలాంటి పరరాజ దండయాత్రలు జరిగినప్పుడూ, కరువుకాటకాలు సంభవించినప్పుడూ సముద్రతీర ప్రాంతంలోని వారు ఆ ఉపద్రవాలు తప్పించుకోవడానికి గానీ, బ్రతుకుతెరువు చూసుకునేందుకు గానీ సముద్రంమీద తూర్పుదేశాలకూ, ద్వీపాలకూ సబురు వెళ్ళేవారు. ఓడ ప్రయాణాన్ని సబురు అంటారు. సముద్రతీర ప్రాంత కళింగదేశ వర్తకులు వ్యాపారంకోసంగా తూర్పుదేశాలయిన బర్మా, కంబోడియా, మలయా ద్వీపకల్పము, సుమాత్రా, జావా, బాలి మొదలయిన దేశాలకూ ద్వీపాలకూ సబురులు చేసేవారు. పూర్వకాలంలో బర్మా, మలయాద్వీపకల్పమూ, సుమాత్రా, జావాల నదీతీరాలలో బంగారపు ఇసుక దొరికేదనీ, కొండప్రాంతాలలో బంగారపు గనులు ఉండేవనీ, ఆ కారణం చేత ఈ దేశాలకూ, ద్వీపాలకూ సువర్ణభూమి అనీ, సువర్ణద్వీపమనీ పేరువచ్చిందనీ చెబుతారు. ఇక్కడ బంగారమే కాకుండా, వెండి, తగరం, అగరు, కర్పూరం, ఇతర సుగంధద్రవ్యాలు కూడా పుష్కలంగా లభ్యమయ్యేవి. మనదేశ రాజుల రాజభోగాలకు ఈ సుగంధద్రవ్యాలు, వెండి బంగారాలూ కావలసి వచ్చేవి. మనదేశ వర్తకులు సాహసంతో ధ్రువనక్షత్రాన్ని దిక్కులు తెలిపే సాధనంగా చేసుకుని ఓడలమీద సబురులు చేసి ఈ సరుకులన్నీ తెచ్చేవారు. దక్షిణహిందూ దేశంలోని తూర్పుతీరంలో ఈ విధమైన ఓడలమీద వర్తకం సువర్ణభూమితో మొట్టమొదటగా చేసినవారు కళింగదేశీయులే. చీనా దేశ వర్తకులూ, మనదేశ వర్తకులూ ఈ సువర్ణభూమిలో కలుసుకునేవారు. ఆ కాలంలో వర్తకం అంటే ఇక్కడినుంచి తీసుకువెళ్ళిన సరుకులను అక్కడ ఇచ్చి, అక్కడి సరుకులను ఇక్కడికి తేవడంగా ఉండేది. క్రీ.శ.మూడవ, నాలుగవ శతాబ్దములనాటి తమ దేశచరిత్రలో చీనా వారు తాము సువర్ణభూమిలో కళింగదేశ వర్తకులను కలుసుకున్నామనీ, అక్కడి వర్తకమంతా కాళింగులతోనే అనీ వ్రాసుకున్నారు. అప్పటి ఒక కళింగ వర్తకుడు చీనా దేశానికి కూడా వెళ్ళాడట! కళిగం నుంచి తూర్పు సముద్రాల మీదుగా చీనావెళ్ళి రావడానికి నాలుగేళ్ళు పట్టేదట! కళింగ వర్తకులు ఒక్కొకరు తెగించి ఇరవై, నలభై, ఎనభై, వంద, రెండు వందలు ఓడలు కట్టుకుని వర్తకానికి వెళ్ళేవారట. దేశంలో ఉపద్రవం సంభవించినప్పుడు కళింగదేశ జనం గుంపులు కట్టుకుని సముద్రం మీద ఓడలలో పడడమే. సముద్రప్రయాణం అంటే భయం కాని, పిరికితనంగానీ ఉండేది కాదు. కళింగ దేశం నుంచి ఆ దేశాలకు వెళ్ళినవారు అక్కడ వారు నివసించిన ప్రదేశాలకు కళింగమనే పేరు పెట్టుకున్నారు. ఇట్టివారిలో ఆ దేశాలలో ద్వీపాలలో రాజ్యాలు స్థాపించి రాచరికం చేసినవారూ వున్నారు. జావాను క్రీస్తుశకం ఎనిమిది, తొమ్మిది, పదవ శతాబ్దులలో పాలించిన శైలేంద్రవంశపు రాజులు కళింగదేశీయులే.
శైలేంద్రులు జావాలో రాచరికం చేస్తున్న కాలంలో కళింగాన్ని పాలించిన వారు గంగవశీయులు. పశ్చిమ, తూర్పు గంగరాజులని వీరివి రెండు కోవలు. పశ్చిమ గంగవంశ రాజులు మైసూరులో పాలించారు. తూర్పు గంగవంశరాజులు కళింగాన్ని పాలించారు. పూర్వం మైసూరునుంచి పాలించిన గంగవంశరాజులలో ఓ ఐదుగురు తమ బలపరాక్రమాలతో రాజ్యం సంపాదించుకోవాలని బయలుదేరి దేశాలు తిరుగుతూ కళింగానికి వచ్చి అక్కడ మహేంద్రగిరిపై వెలిసి ఉన్న గోకర్ణస్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహంతో అక్కడి రాజులను జయించి కళింగ దేశంలో గంగరాజ్యం స్థాపించారు. వీరు కళింగాన్ని క్రీ.శ.500 ల ప్రాంతం నుండి 1400 ప్రాంతం దాకా కళింగానికి ఏలికలుగా ఉన్నారు. వీరిలాగా అవిఛ్ఛిన్నంగా తొమ్మిదివందల సంవత్సరాలపైని రాజ్యమేలిన వంశం దక్షిణహిందూదేశంలో మరొకటి కనబడదు. పూర్వకాలం నుంచి కళింగదేశ అడవులు శ్రేష్ఠమైన ఏనుగులకు ప్రసిధ్ధి. కళింగదేశ రాజుల సైన్యంలో ఎక్కువగా ఏనుగులు ఉండడంవలన వీరికి గజపతులు అనే పేరు వచ్చింది.
ఈ గంగవంశరాజులలో కళింగాన్ని క్రీస్తుశకం వెయ్యవ సంవత్సరానికి ముందు పాలించినవారిని ప్రాచీన గాంగరాజులనీ, ఆ తరువాతి వారిని అర్వాచీన గాంగరాజులనీ చరిత్రకారులు అంటారు. మొదటివారికంటే తరువాతివారే చాలా ప్రతాపవంతులు. వీరిలో వజ్రహస్తదేవుడు మొదటి మహారాజు. ఇతని కొడుకు రాజరాజదేవు, మనుమడు అనంతవర్మ చోడ గంగదేవుల రాజ్యకాలంలో వీరికీ చోళమహారాజులకూ చాలా యుధ్ధాలు జరిగాయి. గంగరాజులందరిలోనూ అనంతవర్మ చోడగంగదేవు చాలా ప్రసిధ్ధుడూ, పరాక్రమశాలీను.
గంగవంశంవారి రాజ్యం ఒకప్పుడు ఉత్తరాన గంగానది వరకు, దక్షిణాన గోదావరివరకూ వ్యాపించింది. రాజ్య సంపాదన, సంరక్షణ ప్రయత్నంలో గంగవంశపు రాజులకూ అటు ఉత్తరంవైపు బంగాళాదేశాన్ని పాలించిన నవాబులతోనూ, పడమటి వైపు చేదిరాజులతోనూ, దక్షిణంవైపు చాళుక్య చోళులతోనూ, కొండవీటి రెడ్డిరాజులతోనూ తరచుగా యుధ్ధాలు సంభవించేవి. ఈ వంశం వారిలో నాలుగవ భానుదేవు కళింగాన్ని పాలించిన చివరి రాజు. వీరి పాలన క్రీ.శ.1437లో అంతరించింది.
గంగవంశపు రాజులలో మొదటివారు శైవులు; తరువాతి వారు వైష్ణవులు. వీరు గొప్ప దేవాలయాలను నిర్మింపజేశారు. ముఖలింగం, శ్రీకూర్మం దేవాలయాలు వీరు కట్టించినవే. పూరి జగన్నాధాలయన్ని కట్టించినవాడు అనంతచోడ గంగదేవు. కోణార్క లోని సూర్యదేవాలయాన్ని కట్టించినది నరసింహదేవు. అద్భుతాలయిన ఈ కట్టడాలతో కళింగ గాంగవంశపు రాజులు ఉత్కలానికి అందం తెచ్చారు. వేములవాడ భీమకవి అనంతవర్మ చోడగంగదేవు తండ్రి అయిన రాజరాజదేవుకు సమకాలికుడని చెబుతారు. ఈ గాంగరాజులు వేదవిద్యలను, కళలను పోషించి కీర్తిగడించారు.