కాకతీయులు (1)
ఆంధ్రుల చరిత్రలో కాకతీయులది ఒక ప్రముఖ స్థానం. మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రలలో అనుమకొండ హనుమకొండకు తొలి రూపం), వరంగల్లులను గురించి, ఈ రెండు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించిన కాకతీయ రాజుల వంశావళిని గురించి చెప్పే గాథలు వున్నాయి. చరిత్ర పరంగా చూసినప్పుడు ఈ గాథలకు, కొన్ని కొన్ని చోట్ల అతిశయమూ కల్పనా చేరి వుండడం వలన, అన్నిటికీ అంతగా ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ, కొన్ని వందల సంవత్సరాలుగా జనశ్రుతంగా తరం నుంచి తరానికి వచ్చి చేరినవి కాబట్టి, ఆంధ్ర దేశ చరిత్ర రచన మొదలెట్టిన తొలినాళ్ళలో ఆ కథలలోని విషయాలు కొన్నైనా ఆధారాలుగా నిలిచాయి కాబట్టీ వాటి ప్రాముఖ్యత వాటిది. కాకతీయుల చరిత్రకు సంబంధించి ఆ గాథలలో చరిత్రకు దగ్గరగా వున్నట్లనిపించే కొన్న గాథల సారాంశం ఇది:
కాకతీయ వంశానికి చెందిన మొదటి తరం రాజులలో ఒక రాజు త్రిభువనమల్లుడు. ఆ రాజుకి కాకతి అనే దేవత కరుణ వలన కాకతి ప్రోలుడు జన్మించాడు. త్రిభువనమల్లుడు కటకాన్ని పాలిస్తూండిన తిరుగుబాటుదారయిన రాజును రణంలో ఓడించి చంపి, ఆ స్థానంలో అతని కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి, ఆ రాజు ధనాగారాన్ని వెంట తరలించుకు వెళ్ళాడు. గంగాపురం అనే ప్రదేశంలో త్రిభువనమల్లుడు ఎన్నో దేవాలయాలను నిర్మింప జేశాడు. ఈ రాజు 86 సంవత్సరాలు పాలించి శక సంవత్సరం 958 లో మరణించాడు.
ప్రోలుడు రాజ్య భారాన్ని చేపట్టే నాటికి చాలా చిన్నవాడు. ఇది అదనుగా చూసుకుని సామంతులు కొందరు తిరగబడతారు. కటకాన్ని పాలిస్తూండిన రాజు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విశ్వనాథదేవుడనే వాడిని ప్రోలుని మీదికి దండు పంపుతాడు. అనుమకొండ అతడి వశమవుతుంది. ఆ తరువాత 12 సంవత్సరాలు అనుమకొండ పరరాజుల హస్తగతమై వుంటుంది. ఈ కాలంలో వారు ఒక పెద్ద చెరువును కూడా తవ్వించారు. కన్నడసముద్రమని ఆ చెరువుకు పేరు. ప్రోలుడు తన రాజధానిని ఒక స్నేహితుడైన సామంతుని అధీనంలో వుంచి, ఒక రహశ్య మార్గం ద్వారా వెళ్ళి అనుమకొండను జయించి, మళ్ళీ కటకం మీదికి దండు వెళ్ళి, యుధ్ధంలో ఆ రాజును చంపి, వాని కుమారుని ఆ స్థానంలో వుంచి, 2 కోట్ల
సంపదను సంపాదించుకొస్తాడు.
ఈ ప్రొలుడు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మింపజేసి, ఆ దేవాలయం చుట్టూ 8 యోజనాల పర్యంతగా వుండే ఒక నగరాన్ని కూడా నిర్మింపజేస్తాడు. ఇదే ఓరుగల్లు పట్టణం. ఓరుగల్లు కోటకు తొలి నమూనా చిత్రం ఆ స్థానం మీద 909 లో వ్రాయబడింది.
వరంగల్లులో శివాలయం పరశువేది శంభు ఆలయంగా పిలవబడేది. ఆ ఆలయానికి ఆగ్నేయంగా ఒక పెద్ద శిల వుండేది, కనుక ఆ ప్రదేశానికి ఏకశిలానగరమనీ, ఆ ప్రదేశం మీదుగా వెళ్ళే బండి చక్రం ఒకటి ఎప్పుడూ ఒకవైపుకు ఒరిగేది కాబట్టి ఆ ప్రదేశానికి ఓరుగల్లు అనీ పేర్లు వచ్చాయి.
ఓరుగల్లులోని దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన ముఖ్యమయిన దేవతా విగ్రహాలు 1. ముక్తేశ్వర, 2. విశ్వనాథ, 3. వ్యక్తవిరూపాక్ష, మల్లికార్జున, 5. రామేశ్వర, 6. నీలకంఠ, 500 చిన్న గుడులు శివునివి, 10 దేవివి, 10 గణపతివి, 300 వాసుదేవునివి, 10 వీరభద్రునివి, కొత్తగా నిర్మించబడ్డాయి.
ప్రోలునికి ఒక దుష్టనక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ నక్షత్ర ప్రభావం వలన అతడు తండ్రిని చంపేవాడుగా అయ్యాడు.
ఆ పిల్లవాడు రుద్రుడుగా నామకరణం చేయబడి, మంచి తెలివి కలవాడుగా, శక్తిమంతుడుగా పెరిగాడు. అతడికి ఉపనయనం అయిన తవువాత, శంభుని దేవాలయానికి రాజ రక్షకుడుగా నియమించబడ్డాడు.
మహాదేవుడు ప్రోలునికి రెండవ కుమారుడు. ఇతడు కుష్టువ్యాధి పీడితుడయ్యాడు. ఒక బ్రాహ్మణునికి 5 పుట్ల నువ్వులను ఒకచోట పోసి పెద్ద రాసిగానూ, తోడుగా బంగారంతో చేసిన ఆకులను, మాడలను, దానంగా ఇచ్చిన తరువాత ఆ శ్వేతకుష్టు వ్యాధి నుంచి మహాదేవుడు బయటపడ్డాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఆ తరువాత బ్రహ్మరాక్షసునిగా మారాడు. ప్రోలుడు ఆ బ్రాహ్మణుని కుమారునికి పెద్ద మొత్తంలో ధనమిచ్చి కాశీలో దోష పరిహారార్ధం చేయించవలసిన పూజలను చేయించమని పంపాడు. అలా చేసిన తరువాత, నువ్వులరాసిని దానంగా తీసుకోవడం వలన సంక్రమించిన దోషం పరిహారమై ఆ బ్రాహ్మణుడు ముక్తిని పొందాడు.
ఒకసారి, ప్రోలుడు శంభులింగమును ప్రార్ధించదలచి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో లోపలి ద్వారం దగ్గర రుద్రుడు నిద్రపోతున్నాడు. రుద్రుడి నిద్రను భంగపరచడం ఇష్టపడని ప్రోలుడు పక్కనుంచి ప్రవేశించబోగా, అతని పాదం బొటనవ్రేలు రుద్రునికి తగిలి అతడు నిద్ర మేల్కొంటాడు. నిద్రమత్తు పూర్తిగా వదలని రుద్రుడు, ప్రోలుని ఒక దొంగగా భావించి అతని చేతిలో వున్న కటారితో పొడుస్తాడు. అయితే వెంటనే తనచే పొడవబడినది తండ్రేనని గ్రహిస్తాడు. ప్రోలుడు పురోహితులనూ, రక్షకులనూ, మంత్రులనూ అందరినీ పిలిపించి వారికి జరిగిన సంగతిని, దానికి కారణమైన రుద్రుని జన్మకు సంబంధించిన సంగతినీ చెప్పి, రుద్రుడినే తన అనంతరం రాజునిగా పట్టభిషిక్తుని చేయమంటాడు. రుద్రుడు పట్టభిషిక్తుడవుతాడు. కొన్నాళ్లకు ప్రోలుడు మరణిస్తాడు. అనంతరం రుద్రుడు 73 సంవత్సరాలు పాలించాడు. అతని పాలన 1031 లో అంతమయింది.
రుద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ రాజ్యాన్ని సిరిసంపదలతో నింపాడు. ఓరుగల్లుకు దక్షిణంగా 12 మైళ్ళ దూరంలో వున్న అయినవోలు గ్రామానికి పశ్చిమాన మైలార దేవునికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అనుమకొండకు నాలుగు మైళ్ళు (రెండు కోసులు) దూరంలో వున్న ఒడ్డిపల్లి అనే గ్రామంలో బొద్దన గణపతికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. మొగలిచెర్ల అనే గ్రామంలో మహాశక్తికి దేవాలయాన్ని నిర్మింపజేసి తిరుణాళ్ళు నిర్వహించబడేలా సౌకర్యం చేశాడు.
కటకం మీదకు దండెత్తి వెళ్ళి ఆ రాజును చంపి, ఆ స్థానంలో అతని కుమారునికి పట్టం కట్టి ప్రతిగా సంప్రదాయకంగా రావలసినది గ్రహించి తెచ్చాడు. ఏకుదేవుడు (?) అనే ఒక సామంతుడు తిరుగుబాటు చేయ యత్నిస్తే, అతడిని ఓడించాడు. వచ్చే దారిలో వెలనాడులో ప్రవేసిస్తాడు. ఆ రాజులు అతడి శౌర్యాన్ని మెచ్చుతారు. ఆ తరువాత కొందరు మ్లేఛ్ఛులనూ (?) జయిస్తాడు.
తండ్రిని చంపిన దోషం పోవడానికి చేయాల్సిన దోషపరిహార క్రియలన్నిటినీ నిర్వర్తిస్తాడు. చాలా ధనం ఖర్చుపెట్టి ఓరుగల్లులో మంచి శిల్పకళతో నిండినవైన ఆలయాలను నిర్మింపజేశాడు. 1000 స్థంభాలు ఆ గుడి ప్రాంగణాన్ని అలంకరించి ఉంటాయి.
చతుర్ముఖేశ్వర దేవాలయానికి నాలుగు వైపులా ద్వారాలపై నాలుగు శాసనాలను నాలుగు భాషలలో లిఖింప జేశాడు.
వరంగల్లు పట్టణంలో కొత్త వీధులను, భవనాలను నిర్మింపజేసి బాగా వృధ్ధిపరిచాడు. రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొందరి తప్పుడు సలహాలను విని అతనికి విరోధిగా మారతాడు. అయితే, ఈ సంగతులను గ్రహించిన రుద్రుడు మహాదేవుని కార్యకలాపాలన్నిటినీ ఒక కంట కనిపెడుతూ వుండాల్సిందిగా మంత్రులను నియోగిస్తాడు. శ్రీశైల మఠాథిపతుల సలహా మీద గణపతి అనే పేరున్న ఒక బాలుడిని, (ప్రమథ)గణాల అనుగ్రహంతో జన్మించినవాడుగా నమ్మబడుతున్న వానిని, అక్కడినుంచి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు.