క్రీడాభిరామము – (4)

kriidaabhiraamam-4

వస్తు నిర్దేశం – అంటే రచనలో ఏ ముఖ్య విషయాన్ని గురించి చదవబోతారో ఆ విషయాన్ని సూచనప్రాయంగా ముందుగానే చెప్పడం…క్రీడాభిరామం వీధి నాటక పధ్ధతిలో చేయబడిన రచన కాబట్టి, నాటకంలో ప్రేక్షకుడు చూడబోయ సంగతులను గురించి సూచనప్రాయంగా చెప్పడానికి ఉద్దేశించిన రెండు పద్యాలలో ఇది రెండవ పద్యం.

“చేర వచ్చివచ్చి దూరంబుగాఁ బోదు
డాయవత్తు దవ్వు పోయిపోయి
మాట లింక నేల మాపాలిటికి నీవు
మాయలేడి వైతి మంచిరాజ!”

మామూలైన మాటలతో మధురమైన బావాన్ని హృద్యంగా చెప్పిన పద్యం ఇది.

“దగ్గరగా వచ్చినట్టే వచ్చి ఇంతలోనే ఎటుపోతావో పోతావు. వెళ్ళిపోయావే అనుకుంటూ దిగులుతో ఉన్నంతలోనే ఇదిగో దాపునే వున్నానుగా అన్నట్లుగా కళ్ళకు కనబడతావు. నీతో పెద్ద గోడవై పోయిందిగా స్వామీ! ఇన్ని మాటలెందుకు…నా పాలిటికి నువ్వొక మాయలేడివైపోయావయ్యా మంచిరాజా!” – అని ఈ పద్యం భావం!

ఇందులోని సౌదర్యమంతా ‘మా పాలిటికి నీవు మాయలేడివైతి మంచిరాజ!’ అనే పోలికలో ఇమిడి వుంది.

You appear too close but leave all at once and go
You come near again after going too far and lost
Why these many words, my dear Mamchiraaja!
To our fate you have become that magical deer!

క్రీడాభిరామము – (3)

kaakatiiya_3

వస్తు నిర్దేశం – ప్రేక్షకులు చూడబోయే సంగతులను సూచనప్రాయంగా తెలియజేసే పద్యం. తెరవెనుకనుంచి వినిపిస్తుంది.

కామమంజరి అనే పెరున్న వేశ్య, ఏదో కారణాన దేశాంతరగతుడైన తన ప్రియుడు, ‘క్రీడాభిరామం’ లో కథానాయకుడు అయిన కాసల్నాటి గోవింద మంచనశర్మను ఉద్దేశించి రాసి పంపిన ప్రేమలేఖను అతని స్నేహితుడయిన టిట్టిభ సెట్టి చదివి వినిపిస్తుండడంతో, అత్యంత రమణీయంగానూ, వ్యంగ్య వైభవంగానూ ఇందులో కథావస్తు నిర్దేశం చేయబడింది. రెండు పద్యాలు ఇవి. మొదటి పద్యం భావం –

“రసజ్ఞ శేఖరా, మధుపా! విరిసిన అరవిందాలున్న ఈ వనవాటికను (రంగురంగుల పూవులున్న, రమణీయమైన వన ప్రదేశాన్ని) విదిలి పెట్టి, చెట్టులంటా పుట్టలంటా (ఆ తిరుగుడులేమిటి?) అడవులలో పడి ఏం దొరికించుకుందామని భ్రమతో తిరుగుతున్నావు? నీ వివేకమంతా ఏమయిపోయింది? పాతబడిపోయిందా…అంటే నశించిపోయిందా?” అని మొదటి పద్యం.

గతి రసికుండ! షట్చరణ! గానకళాకమనీయ! యో మధు
వ్రత! విక చారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి వటవీ ప్రదేశమునఁ జెట్టులఁ జేమలఁ నేమి గల్గునన్
రతి నిటు సంచరించెదవు ప్రాఁబడిపోయెనె నీ వివేకమున్?

Six-footed flyer! Sweet-tongued singer! Oh honey bee!
Why did you discard this place of flowers in full bloom?
And with what expectations do you roam among the
Forest shrubs and trees? Have you lost all your prudence?

క్రీడాభిరామము – (2)

kaakatiiya_2

మహాకవి శ్రీనాథుడు, వల్లభరాయుడు సమకాలీకులని పండితుల అభిప్రాయం. పద్యనిర్మాణంలో శ్రీనాథుడు అనుసరించిన పధ్ధతినే ‘క్రీడాభిరామం’ లో వల్లభరాయుడు చాలా చోట్ల అనుకరించాడు. శ్రీనాథుని అలంకారికమైన, అక్కడక్కడ శృంగారమయమైన, ప్రౌఢమైన పద్యనిర్మాణశైలిని వల్లభరాయుడు బాగా ఇస్టపడ్డాడని ‘క్రీడాభిరామం’ లోని చాలా పద్యాలు చెప్పకనే చెబుతాయి.

రచించబడిన తరువాత కొంతకాలానికి మరుగునపడిపోయి, ఆ తరువాతి కాలగర్భంలో కలిసిపోయి దాదాపుగా అయిదువందల సంవత్సరాలు కనుమరుగైపోయింది ‘క్రీడాభిరామం’. ఈ కావ్యాన్ని గుర్తించి, ఆ స్థితినుంచి వెలుపలికి తీసి మళ్ళీ వెలుగులోకి తెచ్చిన వారు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు. తెలుగుసాహిత్యం మీద మక్కువ, శ్రధ్ధ వున్న వ్యక్తులేవరైనా సరే ఈయన పేరును ఎన్ని సార్లు స్మరించుకుంటే అంత మంచిది. తెలుగులో ‘క్రీడాభిరామం’ కావ్యాన్నే కాక, నన్నెచోడుని ‘కుమారసంభవం’, త్రిపురాంతకుని ‘త్రిపురాంతకోదాహరణం’, బద్దెన ‘నీతిసారముక్తావళి ‘ మొదలైన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రకటించిన వారాయన. తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో క్రీ.శ.1856 లో తిరగరాయబడ్డ ‘క్రీడాభిరామ’ పు తాళపత్ర ప్రతిని గుర్తించి, ప్రాచీనమైన ఆ ప్రతిలోని గ్రంథపాతాలను సంస్కరించి, పరిస్కరించి, అందులోంచి మరొక వ్రాతప్రతిని తయారుచేసుకుని 1909లో ప్రకటించారాయన.

‘క్రీడాభిరామం’ కావ్యం వెలుగులోకి రావడం వలన జరిగిన అతి ముఖ్యమైన సంగతులలో ఒకటి – ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే విషయ ప్రకటనం చేసింది శ్రీకృష్ణదేవరాయలు కాదని, అది వల్లభరాయుడనీ, ఆ కీర్తి నిజానికి వల్లభరాయునికి దక్కాలనీ!

‘క్రీడాభిరామం’ పద్యంలో వల్లభరాయుడు చేసిన original idea ని తీసుకుని ఇంకొన్ని మెరుగులు దిద్ది మరింత relevant గా వేరే పద్యాన్ని కృష్ణదేవరాయలు అందించాడు తన ‘ఆముక్తమాల్యద’ లో!

“జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందుఁ దెనుఁగు లెస్స
జగతిఁ దల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చుటాఁడుబిడ్డ మేలుగాదె.”

Mother is Sanskrit for all the languages that now exist
Amongst the languages of the land Telugu is the best;
Isn’t the sister-in-law who wishes for well being and wealth
In fact more comforting for a woman than her own mother!

క్రీడాభిరామము -(1)

kaakatiiya_1

తెలుగులో ‘క్రీడాభిరామం’ ఒక విలక్షణమైన కావ్యం. భారతీయ సంప్రదాయంలో దశరూపకాలలో ఒకటైన ‘వీధి’ నాటక పధ్ధతిలో ఈ కావ్యం వ్రాయబడింది. ఈ కావ్యానికి కర్త వినుకొండ వల్లభరాయడు. అయితే, ఇందులోని ప్రతి పద్యంలో కనిపించే శ్రీనాథుని తరహా పద్యనిర్మాణం, భాష, శృంగార పదజాలం ఈ కావ్యం అసలుకి శ్రీనాథుని చేతనే రచించబడి ఏ కారణం చేతనో వల్లభరాయని పేర ప్రచారంపొందిందని ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో ప్రబలంగా ఉండింది. ఒకవైపు పెద్దలలో ఆ అభిప్రాయం అలా ఉన్నప్పటికీ, క్రీడాభిరామం కర్తృత్వం వల్లభరాయనికే ఆపాదించబడి ఇప్పటికీ పదిలంగానే వుంది.

తెలుగులోని పద్యకావ్యాలలో నిజానికి ‘క్రీడాభిరామం’ ఉన్నంత దగ్గరగా మరే కావ్యం ఉండదనే మాట అంత నిజం. సంస్కృతంలో రావిపాటి త్రిపురాంతకునిచే రచించబడిన ‘ప్రేమాభిరామం’ అనే కావ్యాన్ని అనుకరిస్తూ ‘క్రీడాభిరామం’ రచించబడిందని వల్లభరాయడే చెప్పిన మాట. అయితే, ‘ప్రేమాబిరామం’ ఇప్పటికీ లభించనిది కాబట్టి. ఈ అనుకరణ ఎలాంటిదనేది ఇప్పటికీ అస్పష్టమే!

వినుకొండ వల్లభరాయని తండ్రి తిప్పయామాత్యుడు విజయనగర ప్రభువైన రెండవ హరిహరరాయల కొలువులో రాజోద్యోగి అనే అధారాన్ని బట్టి ‘క్రీడాభిరామం’ బహుశా 15వ శతాబ్ది ప్రధమార్ధంలో రచించబడి వుండవచ్చని తేల్చారు. ‘క్రీడాభిరామం’ ఏకాశ్వాస ప్రబంధం. మొత్తం 245 పద్యగద్యలతో చంపూ పధ్ధతిలో చేయబడిన రచన. కాకతీయుల ఓరుగల్లు నగరం, కోట, అందులో ప్రజల వేషభాషలూ, ఆహారాలూ, అలవాట్లూ ఇందులో వర్ణించబడ్డాయి. అయితే, ఇందులో అక్కడక్కడా వర్ణనలలో చోటుచేసుకున్న సభ్యంకాని పదజాలం, వర్ణనా విధానం కారణంగా ఈ మొత్తం రచన చెడ్డదిగానూ, మామూలు పాఠకులకు పఠనయోగ్యమైనది కానిదిగానూ నిర్ధారించబడింది.

సభ్యంకాని, అభ్యంతరకరమయిన వర్ణనలు వున్న భాగాలను మినహాయిస్తే, ‘క్రీడాభిరామం’ నిస్సందేహంగా ఒక విలక్షణమైన రచన. ఆ కాలపు ఏ కవీ ఊహించని కథా వస్తువుతో ఒక కాల శకలాన్ని – కాకతీయుల పరిపాలనా కాలంలోని ఒక రోజును – వాస్తవానికి ఏవిధంగానూ అతీతంగా అనిపించనట్లుండే పాత్రల ద్వారా అక్షరభధ్ధంచేసి చూపించిన రచన. కథానాయకులనదగిన గోవింద మంచనశర్మ, అతని అనుచరుడు (financier) అనదగిన టిట్టిభశెట్టి…వీరిరువురు నడిచే మార్గంలోనే పాఠకుడినిగూడా మానసికంగా నడిపించగలిగేంత ప్రతిభావంతమయిన రచనావిధానంతో ముందుకు సాగుతుంది ఈ రచన. ఆకారణంగా, ఈ కావ్య సౌందర్యమంతా ఈ కావ్యంలోని ప్రతి పద్యంలో, గద్యలో అక్షరాలతో చిత్రించి చూపించిన ఆనాటి కాకతీయ జనజీవనం వుండి పాఠకుని మనోనేత్రాలకు కనబడుతుంది.

కాలగమనంలో మరుగునపడిపోయిన ఈ రచన, మళ్ళీ 1909లో బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి పుణ్యమాని, వారే ప్రచురించిన ‘విస్మ్రుతకవులు’ శీర్షిక పరంపరలో భాగంగా వెలుగు చూసింది. ఆ తరువాత, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి విపులమైన పీఠికతోనూ, వారి కొన్ని సవరణలతోనూ 1928లో ముద్రించబడింది. ఆ తరువాతి కాలంలో ఎమెస్కో వారు వారి ‘సంప్రదాయ సాహితి – 20’ గా స్వర్గీయ బి.వి. సింగరాచార్యగారి ‘సమాలోకనం’ తో 1972లో ప్రచురించారు. ఇవి నాకు తెలిసిన ప్రతులు, చివరి రెండూ నాకు అందుబాటులో వున్నవి. ఇవి కాకుండా స్వర్గీయ బండారు తమ్మయ్య గారి సంపాదకత్వంలో వావిళ్ళవారు ప్రచురించిన ప్రతి 1960నాటిది, శ్రీ బి.ఎన్. శాస్త్రి గారి పీఠికతో నవోదయ సమితి, హైదరాబాదు వారు ప్రచురించినది 1968 నాటిది కూడా వున్నాయి.

ఇందులో అసభ్యత అంటూ ఏమాత్రమూ లేని పద్యాలను సాధ్యమయినంత అందంగా అలంకరించడము, వీలయినంత సౌందర్యవంతంగా భావం చెడకుండా ఆంగ్లంలోకి అనువదించడమూ అనేవి ఈ రచనను ఇంకాస్త glorify చేసే దిశగా నా మనసుకు తోచిన, నేను చాలా కాలంగా అనుకుంటున్న సంగతులు. వరంగల్లులో ఇప్పటి కోట శిథిలాలలో నేను తీసిన ఫోటోలపై, ఇందులో అతి ముఖ్యమైనవిగా అనిపించిన పద్యాలను వుంచి Photo Cards గా చేసి, ఒక abridged edition గా అవసరమైన notes తోనూ ఆంగ్లంలోనికి అనువాదంతోనూ ఈ పోస్టుల పరంపర సాగుతుంది.

***                                                            ***

“గణన కెక్కిన దశరూపకములయందు
వివిధ రసభావభావన వీథి లెస్స
యే కవీంద్రుఁడు రచియించె నీ ప్రభంధ
మనుచు మీ రానతిచ్చెద రైన వినుఁడు.”

‘క్రీడాభిరామం’ కృత్యవతరణ పద్యం ఇది.

రూపకం అంటే దృశ్య కావ్యం అని అర్ధం. బారతీయ సంప్రదాయంలో దశరూపకాలు ఇవి:
1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంకము, 10. ఈహామృగము.

ఈ పదింటిలో ఎనిమిదవది వీధి. అయితే, ‘వీధి’  నాటక పధ్ధతి ఎంతగా జనాదరణ పొందిందో వేరే చెప్పనక్కరలేదు. వినోదానికైనా, ఒక సందేశాన్ని జనం మనసులలోకి పంపించాలన్నా ఆధునికంగానూ ఈ పధ్ధతినే ఆశ్రయించడం ఇప్పటికీ చూస్తుంటాం.

 Among the much acclaimed ten methods of drama,
Method ‘Street’ capable of exhibiting various emotions
Is without doubt the best, if you order me to reveal
Which great poet authored this Prabandhathen listen.

కాకతీయ శిల్పం

శిల్పాన్ని మలచడంలో అవలంబించిన పధ్ధతిని (style ని) దృష్టిలో పెట్టుకుని చూస్తే, తూర్పు చాళుక్యుల కాలపు శిల్పం అలంకరణ   పెద్దగా ఉండని సాదా శిల్పం. పశ్చిమ చాళుక్యులది అలంకరణ సహిత శిల్పం. హొయసలులది అమితాలంకరణతో నిండిన శిల్పం. కాకతీయులది పశ్చిమ చాళుక్యుల కాలపు అలంకరణకూ హొయసలుల కాలపు అమితాలంకరణకూ మధ్యస్తంగా ఉండే శిల్పం అని పెద్దల మాట. తనదైన ఒక ప్రత్యేకతను నిర్ధారించుకుని కాకతీయ శిల్పం, ఆ వంశపు మలితరం రాజులలో మొదటివాడనదగిన రుద్రదేవుని పరిపాలనా కాలంలో, అంటే క్రీ.శ.1158 నుండి 1195 మధ్య కాలంలో, ఊపిరిపొసుకుని వికాసంపొందింది.

వేయి స్తంభాల గుడి - చిత్రం (1)
వేయి స్తంభాల గుడి – చిత్రం (1)

రుద్రదేవుడు కాకతీయ వంశపు రాజులలో రెండవ ప్రోలుడు గా పిలవబడే రెండవ ప్రోలరాజు (క్రీ.శ.1115-1157)యొక్క ఐదుగురు పుత్రులలో పెద్దవాడు. క్రీ.శ.1157లో తీరాంధ్ర మండలంలో జరిగిన ఒక యుధ్ధంలో సంభవించిన ప్రోలుని మరణానంతరం రాజ్యాధికారాన్ని చేబడతాడు. తండ్రి అయిన రెండవ ప్రోలుడు కాకతీయ సామ్రాజ్యమనే సౌధానికి పునాదులను వేస్తే, కొడుకైన ఈ రుద్రదేవుడు ఆ పునాదులపై తండ్రి తలచిన రీతిలో ఆ సౌధ నిర్మాణాన్ని పూర్తిచేసి చూపెట్టాడు. రుద్రదేవుని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యమైంది. స్వతంత్ర రాజ్య స్థాపన సందర్భంగా, శక సంవత్సరం 1084 చిత్రభాను సంవత్సరం మాఘ శుధ్ధ త్రయోదశికి   సరియైన క్రీ.శ.1163 జనవరి 19 శనివారం నాడు  అనుమకొండలో తనపేరున రుద్రేశ్వరదేవుని, వాసుదేవుని, సూర్యదేవుని ప్రతిష్ఠించి ఆ త్రికూటానికి వేయిస్తంభాలతో విరాజిల్లే మండపం వున్న దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఇప్పుడు వేయి స్తంభాల గుడిగా పిలవబడుతూన్నది. ఆ ఆలయ పోషణ కొసంగా మద్దిచెఱువుల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలియజేసే శాసనం వేయిస్తంభాల గుడి శాసనంగా ప్రసిధ్ధమైంది. శాసనంలోని భాష సంస్కృతం. రుద్రదేవుని తండ్రియైన రెండవ ప్రోలరాజు విజయాలు, స్వతంత్ర రాజ్య స్థాపనకు ముందు రుద్రదేవుని విజయాలు అన్నీ కలిపి ఇందులో దాదాపుగా యాభై శ్లోకాలలో చెప్పబడినాయి. భరద్వాజ గోత్రుడు, రామేశ్వరదీక్షితుని పుత్రుడు, అద్వయామృత యతి శిష్యుడు అయిన అచింతేంద్రయతి  ఈ శాసనాన్ని ఒక చిన్న కావ్యంలాగా తీర్చి దిద్దాడని పెద్దల భావన.

వేయి స్తంభాల గుడి - చిత్రం (2)
వేయి స్తంభాల గుడి – చిత్రం (2)
వేయి స్తంభాల గుడి - చిత్రం (3)
వేయి స్తంభాల గుడి – చిత్రం (3)

రుద్రదేవుడు మంచి యోధుడు. కాకతీయ రాజ్య స్థాపకుడు. త్వరలోనే రాజ్యానికి తగినదైన ఒక రాజధాని, ఆ రాజధానికి సరితూగగల భవన సముదాయం, ఆ సముదాయానికి తగిన భద్రత, వీటన్నిటి అవసరాన్ని గుర్తించినవాడై కాకతీయుల ఆరాధ్య దైవమైన స్వయంభువ శివుని సన్నిధిలో ఒక పటిష్టమయిన కోట నిర్మాణానికి ఆలోచన చేసి ఆచరణలో పెడతాడు. కాని ఈ కోట నిర్మాణం అతని తరువాత నాలుగేళ్ళకు రాజై (వీరిరువురి నడుమ మహాదేవుని పాలన నిండా మూడేళ్ళుకూడా లేదని చరిత్ర చెబుతుంది) క్రీ.శ.1199 నుండి 1262 దాకా, ఆరు దశాబ్దాల పైగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన  గణపతిదేవుని కాలంలో గాని పూర్తికాలేదు. అయితే రుద్రదేవుడు వేసిన పునాదులపైనే ఓరుగల్లు కోట నిర్మాణం జరిగిందనేది లోక ప్రసిధ్ధం.

కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (1)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (1)

ఓరుగల్లు కోట మూడు ప్రాకారాలతో పరివేష్టించబడి ఉండేటట్లుగా నిర్మించబడింది. వెలుపలి, మొదటి లోపలి ప్రాకారాలు రెండూ మట్టివి. లోపలిదైన మూడవ ప్రాకారం రాతిది.  ఈ రాతి ప్రాకారాన్ని దాటి లోపలికి వెళితే రాజధాని నగరం, రాజప్రాసాదాలు. ఇక్కడి అప్పటి రాజప్రాసాదాల అవశేషాలు ఇంకా గుర్తించబడలేదు. అయితే, ఇక్కడ ముఖ్యంగా  ఆకర్షించే నిర్మాణాలు శిలా తోరణాలు. కాకతీయరాజుల కాలపు శిల్పకళా కౌశలానికి ఈ తోరణాలు ముఖ్యమైన ఆనవాళ్ళుగా నిలిచి వున్నాయి.

కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (2)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (2)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం - చిత్రం (3)
కాకతీయ శిల్పులు తీర్చి దిద్దిన శిలా తోరణం – చిత్రం (3)

తోరణాల నిర్మాణం భారతీయ ఆలయ వాస్తులో సాంచి స్తూపం చుట్టూ సాతవాహన రాజైన శ్రీ శాతకర్ణిచే క్రీ.పూ.2 వ శతాబ్ది కాలంలో నిర్మించబడిన రాతి ఆవారం (stone balustrade), మధ్యలో నాలుగు దిశలా నాలుగు తోరణ ద్వారాల నిర్మాణంతో ప్రవేశపెట్టబడింది. తోరణ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని అందులోంచే గ్రహించినప్పటికీ, తమదైన శైలిలో అందమైన మార్పులన్నిటినీ చేసి అందులోంచి ఒక విశిష్టమైన నిర్మాణాన్ని సాధించి, కాకతీయ తోరణంగా ప్రతిష్ఠించి, శిల్పకళలో తమ ప్రతిభను చాటుకున్నారు కాకతీయ కాలపు శిల్పులు. తెలుగు ప్రజల కళాదృష్టికి, అభిరుచికి, కాకతీయుల కాలపు శిల్పుల కళా ఔన్నత్యానికి నిదర్శనాలుగానూ, అందులో వారి ప్రతిభను చాటి చెప్పే కీర్తి తోరణాలుగానూ  ఆ శిలా తోరణాలు ఇప్పటికీ  నిలిచి ఉన్నాయి.

dance_divine_1

ప్రస్తుతం ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ (ఆం.ప్ర. శాఖ) వారి పరిరక్షణలో ఉన్న ఈ ప్రదేశంలో, వారిచే భద్రపరచబడి ఉన్న మరొక శిల్ప కళాఖండం, ఒక శిలాఫలకంపై మలచబడిన శక్తిస్వరూపిణి, అంబ అయిన దాక్షాయని నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం. చాలా భాగం ఖండితమైనప్పటికీ, ఈ శిల్పంలో ద్యోతకమవుతూ కనులకు కనుపించే నాట్యం  చూపరులను ఇప్పటికీ పారవశ్యంలో ముంచుతుందనడానికి  ఎంతమాత్రం సందేహించాల్సింది లేదు.

కాకతీయులు (4)

కాకతీయులు (4)

‘కాకతి’ అన్నది ఒక ఊరి పేరా, దేవత పేరా అన్న విషయంపై భిన్నమయిన అభిప్రాయాలూ వున్నాయి. ఆంధ్ర చరిత్ర పరిశోధకుల మధ్య ఈ విషయమై బహు విధాల చర్చ జరిగింది. కాకతీయుల వంశంలో ఈ మొదటిబేతరాజుకు పూర్వమే, అతని పేరులో ‘కాకతి’ శబ్దం కనుపించే ‘కాకర్త్య గుండ్యన’ అనే రాజు వున్నాడు. ఇతడు క్రీ.శ.945-995 మధ్య కాలానికి చెందినవాడు. ఇతని పేరులోని ‘కాకర్త్య’ అనే పదం సంస్కృతీకరణం చెందిన ‘కాకతి’ శబ్దం అనీ, కొన్ని తెలుగు పేర్లు సంస్కృతీకరణం చెందే క్రమంలో గాలి నరసయ్య అనే పేరు వాతుల అహోబిలపతి అయినట్లుగా ‘కాకతి గుండన’ శబ్దం ‘కాకర్త్య గుండ్యన’ గా మారడం అసంభవమేమీ కాదని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనిది సామంతఒడ్డె వంశం. ఒడ్డె పదం ఓడ్ర శబ్దాన్నుంచి పుట్టినది కాబట్టి ఇతడు విశాఖపట్టణ ప్రాంతపు ఒడ్డెనాడుకు చెందినవాడయి వుండవచ్చని ఒక అభిప్రాయం. కాకతీయులు దుర్జయవంశంవారని ఒక శాసనంలో కనబడుతుంది.

కాకర్త్య గుండ్యన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగంలో వున్న వాడని మాగల్లు శాసనం వలన తెలుస్తుంది. ఇతడు అనుమకొండలోని ప్రాచీన రాజవంశజులతో పెళ్ళిసంబంధం చేసుకుని పెండ్లి గుండమరాజు అని కూడా పిలవబడ్డాడు. ఇతనికి కుంతలదేవి అని ఒక సోదరి ఉంది. ఆమెను బలవంతులయిన విరియాల వంశంజులకు ఇచ్చి వివాహంచేయడం ద్వారా వరంగల్లులో తన స్థానాన్ని పదిలం చేసుకో సంకల్పించాడని చెబుతారు. విరియాల వారిది దుర్జయ వంశం. వీరి వృత్తాంతం క్రీ.శ.1000 ప్రాంతపుదైన గూడూరు శాసనంలో వివరంగా వుంది. ఈ రాజులలో ఎఱ్ఱనరేంద్రుడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని, గొప్ప రాజనీతిజ్ఞురాలు, వీరవనిత. పెండ్లి గుండనగా పిలవబడిన కాకర్త్య గుండ్యన సోదరి పేరు కుంతలదేవిగా వున్నా, ఈ విరియాల కామమసాని అనే వనితనే కుంతలదేవిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు.

కాకర్త్య గుండ్యన అనుమకొండలోని రాజవంశీయులతో పెళ్ళిసంబంధ మేర్పరచుకుని, అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లోపలే మరణిస్తాడు. అతని కొడుకైన బేతరాజు అప్పటికి చాలా చిన్నవాడు, బాలుడు. మేనల్లుడు, బాలుడు అయిన బేతరాజును అతని మేనత్తయైన విరియాల కామమసాని (గుండ్యన చెల్లెలైన కుంతలదేవి), భర్తయైన ఎఱ్ఱనరేంద్రుని సహయంతో సంరక్షించి కాపాడుతుంది. బేతరాజు యుక్తవయస్కుడు కాగానే అతడిని రాజ్యాభిషిక్తుని చేస్తుంది. ఇది గూడూరు శాసనంలో చెప్పబడి ‘కాకతి నిల్పుట కోటి సేయదే’ అని కామమసాని రాజనీతిజ్ఞతకు ప్రశంసాపూర్వక కథనంగా లోకోక్తియై చరిత్రలో నిలిచింది.

దేశ చరిత్రలో ఒక నూతన రాజవంశం రూపుదాల్చి నిలదొక్కుకోవడానికి మానవ ప్రయత్నమేకాక, ఆ ప్రయత్నానికి దైవానుగ్రహం కూడా తోడైవుండాలనడానికి కాకతీయుల చరిత్రలోని ఈ కుంతలదేవి – బేతరాజుల ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కాకతి గుండన ముందు చూపుతోకూడినదైన చర్య, కుంతలదేవికి తన అన్నపైనున్న గౌరవం, ఆ అన్న కొడుకూ తన మేనల్లుడూ అయిన బేతరాజుపై ఆప్యాయతా ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులనే ఒక ప్రసిధ్ధ రాజవంశం రూపుదాల్చడానికి కారణమయింది. ఇలా రాజ్యాభిషిక్తుడయిన వాడే మొదటి బేతరాజు. ఇతనికి గరుడ బేతరాజని కూడా పేరు వుంది. ఇతడు క్రీ.శ.995-1052 మధ్య రాజ్యపాలన చేసినట్లుగా తేల్చారు. చారిత్రకంగా ఇతడితోనే కాకతీయవంశం ప్రారంభమయిందని చరిత్ర పరిశోధకులు భావిస్తారు. ఇతని కొడుకు మొదటి ప్రోలరాజు, క్రీ.శ.1052-1076 మధ్య రాజ్యపాలన చేశాడు. ఈ మొదటి ప్రోలరాజు కొడుకే త్రిభువనమల్ల బేతరాజు, క్రీ.శ.1076-1108 మధ్య కాలంలో రాజ్యపాలన చేశాడు. ఇతని కాలానికి ముందు కాకతీయుల వంశంలో ఎంతలేదన్నా నాలుగైదు తరాల చరిత్ర గడిచిపోయిందని చెప్పవచ్చు.

కాకతీయ వంశపు తొలితరం రాజుల పేర్లు గుండన, ప్రోల, బేత అని వుండగా, ఈ త్రిభువనమల్ల బేతరాజు పేరులో ‘త్రిభువనమల్ల’ చేరడానికీ ఒక కథ వుంది. కాకతీయ వంశంలో బేతరాజు అనే పేరుతో రాజ్యమేలిన రాజులు ఇద్దరు కాబట్టి ఇతనికి రెండవ బేతరాజని కూడ పేరుంది. ఇతడు రాజ్యభారాన్ని చేపట్టే నాటికి కళ్యాణి చాళుక్య రాజులలో రాజ్యాధికారం గూర్చి వారిలో వారికి అంతః కలహం చెలరేగింది. ఆ కలహంలో రెండవ బేతరాజు తన అనుకూల్యతను ప్రకటించి అతని పక్షం పోరాడిన విక్రమాదిత్యుడు అనే రాజు త్రిభువనమల్లుడనే పేర చాళుక్య సింహాసనాన్నిక్రీ.శ.1076 అధిష్ఠించాడు. ఆ రాజు తన విజయ సూచకంగా, ఆ ప్రయత్నంలో తనకు సహాయపడిన బేతరాజుకు తనవైన రెండు బిరుదులను ఇచ్చి గౌరవించాడు. వాటిలో ఒకటి ‘త్రిభువనమల్ల’ అనే బిరుదు. ఈ బిరుదు పేరుకు ముందు చేరి రెండవ బేతరాజు ‘త్రిభువనమల్ల బేతరాజు’ అయ్యాడని చరిత్రకారులు చెప్పారు. ప్రజలు ఈ ‘త్రిభువనమల్ల’ అనే బిరుదనామాన్నే బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ కాకతీయ రెండవ బేతరాజుకు చాళుక్య ప్రభువుల వద్ద ఒక విశిష్ట స్థానం ఉండేది అనేది ఈ ఉదంతం వలన తెలియ వచ్చే మరొక విషయం.

కాకతీయులు (3)

కాకతీయులు (3)

శక సంవత్సరం 1166లో ఉమ్మక్క ఒక పుత్రునికి జన్మనిచ్చింది. సకల రాజమర్యాదలతో  ఆ పిల్లవానిని సామంతరాజులందరి సమక్షంలో రాజ్యాభిషిక్తుని చేశారు. ఆ పిల్లవానికి ప్రతాపరుద్రుడని నామకరణం చేశారు. ప్రతాపుడు పెరిగి పెద్దవాడయ్యడు. ఉమ్మక్కకు రెండవ పుత్రుడుగా అన్నమదేవుడు జన్మించాడు. ప్రతాపునికి వేదవిద్య, రాజరికానికి సంబంధించిన అన్ని విద్యలూ బోధించబడ్డ తరువాత అతని 16వ ఏట, 16 మంది కన్యలతో పెళ్ళి జరిగింది. వారిలో మొదటి భార్య విశాలాక్షి. రుద్రాంబ శక సంవత్సరం 1216 లో, 38 సంవత్సరాల పాలన అనంతరం స్వర్గస్తురాలయింది.

రాజ్యాభిషిక్తుడయ్యాక, ప్రతాపరుద్రుడు దిగ్విజయానికి బయలుదేరి, మొదటగా కటక బళ్ళాలుని జయించి, 3 కోట్లు పరిహారంగా పొంది, అతని కొడుకును రాజ్యాభిషిక్తుని చేశాడు. అతడూ, అలా ప్రతాపరుద్రునిచే జయించబడిన మిగతా రాజులు వారి వారి సైన్యాలతో ప్రతాపుని ఆజ్ఞ మేర వెంటవెళ్ళారు. అలా పాండ్య రాజును జయించాడు. దక్షిణానికి మరలి గోదావరి (?) నదిని దాటి రామేశ్వరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రామేశ్వరంలో పూజలు నిర్వహించి, తామ్రపర్ణి తీరాన్ని చేరగా అక్కడ పాలనలో వున్న  విజయనగర రాజైన  నరసింహరాయుడు ప్రతాపుని పెద్ద మొత్తాలలో బహుమానాలతో సత్కరించాడు.

ఆ తరువాత, ప్రతాపుడు ఒక స్త్రీ పరిపాలనలో వున్న రాజ్యం వైపుకు వెళ్ళి అక్కడ  రాణి అయిన ముకుందదేవిని జయించాడు. ఆ పై, కొంకణ, టంకణ, మళయాల, బాహ్లిక, గుజరాష్ట్ర  రాజులను కూడా జయించి వారి వద్ద నుండి పెద్ద మొత్తాలలో బహుమానాలను రాబట్టాడు. ఢిల్లి రాజు ప్రతాపునికి కానుకలను పంపాడు. ఆ కానుకలతో ప్రయాగకు వెళ్ళి, ప్రయాగ మాధవదేవునికి అవి సమర్పించాడు. బెనారసులో కూడా పూజలు నిర్వహించి విశ్వనాథునికి ఆ నగరాన్ని సమర్పించాడు. గయకు వెళ్ళి అక్కడి రాజును కలుసుకున్నాడు. పై ప్రదేశాలలో  చాలా చోట్ల తులాపురుషదానాలను చేశాడు. తన రాజధానికి తిరిగి వచ్చి తమ్ముడైన అన్నమదేవుని, తాను లేని ఆ 12 సంవత్సరాల కాలంలో రాజ్యాన్ని పరిరరక్షిస్తూ వుండినందుకు చాలా ఆనందపడి ఆదరించాడు.

ప్రతాపుడికి విశాలాక్షి ద్వారా విరూపాక్షుడు, వీరభద్రుడు అని ఇరువురు కొడుకులు కలిగారు. ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలో రెండు సార్లు ముసల్మాను సేనలు దండయాత్రలు చేశాయి. ఒక సారి ప్రతాపరుద్రుని బందీగా కూడా చేసుకున్నాయి.

ఢిల్లీ సుల్తాను ప్రతాపుని సాదరంగా ఆహ్వానించాడు. ప్రయాగ మాధవదేవుని భక్తురాలయిన అతని  తల్లి సలహా మీద, ప్రతాపుని కోరిక మీద, డిల్లీ సుల్తాను ఆ హిందూ రాజును, అతనికి సంరక్షకులనుగా 20,000 సైన్యాన్ని తోడుగా ఇచ్చి, బెనారసుకు పంపాడు. ప్రతాపునితో వెళ్ళిన బ్రాహ్మణులను కూడా ఆ రాజు బాగా సత్కరించాడు.

ప్రతాపుడు బెనారసులో 8 తులాపురుషదానాలను చేసి, గోదావరి తీరానికి వెళ్ళడానికి బయలుదేరాడు. దారిలో, శివదేవయ్య మరో 8 రోజులలో ఆ రాజు మరణం గోదావరీ తీరంలో సంభవమని లెక్కకట్టి వున్నందువలన, ఆయన సలహా మీద, కాళేశ్వరం అనే చోట ఆగుతాడు. ఈ లోపల అన్నమదేవుడు, నరపతి ఇరువురూ సుల్తాను సైన్యాన్ని ఓడించి వారిని తరిమికొడతారు. ప్రతాపుడు కాళేశ్వరానికి చేరి వున్నాడని తెలుసుకున్న వారిరువురూ అతని దగ్గరకు వచ్చారు. ప్రతాపుడు వారి శౌర్యాన్ని మెచ్చి తన కూతురైన రుద్రమదేవిని నరపతికి, 5 కోట్ల ధనంతోనూ కృష్ణకు దక్షిణంగా ఉన్న భూభాగంతోనూ, ఇచ్చి వివాహం చేశాడు.

కటకాన్ని 3 కోట్ల ధనంతో సహా రామరాయలను పెండ్లాడిన అన్నమదేవుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. ప్రతాపుడు క్రీ.శ.1324 లో మరణించాడు. అతని రాణి అయిన విశాలాక్షి సహగమించింది. అన్నమదేవుడు వారికి ఘనంగా ఉత్తరక్రియలను నిర్వహించి, రాజ్యాన్ని వీరభద్రునికి ఇచ్చి, ప్రతాపుని కొడుకైన విరూపాక్షుడు తోడుగా రాగా వింధ్య ప్రాంతపు అడవులకు వెళ్ళిపోయాడు. శివదేవయ్య శ్రీశైలం చేరాడు. మొత్తంమీద ప్రతాపుని పాలన 76 సంవత్సరాలు సాగింది.

విజయనగర ప్రభువైన కృష్ణదేవరాయలు కొండవీడు, కొండపల్లి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండలను జయిస్తూ వచ్చి, వరంగల్లును ముట్టడించి అక్కడి ముసల్మానులను తరిమి కొట్టాడు. వరంగల్లులోని కాకతీయ వంశీయులకు రాజమర్యాద పూర్వకంగా ఇవ్వవలసిన ధన్నాని ఇచ్చాడు. ఇది అచ్యుత, సదాశివరాయల పాలన వరకూ సాగింది. అయితే, ఆ తరువాత అళియరామరాయల పతనం తరువాత, డక్కను భూభాగం అంతా ముసల్మానుల హస్తగతమయింది.”

ఇది సంగ్రహంగా మెకంజీ స్థానిక చరిత్రలలో రికార్డు చేయబడిన కాకతీయుల చరిత్ర.

అయితే, ఇప్పుడు ముఖ్యంగా శాసనాధారాలతోనూ, ఇంకా  ఇతరాలయిన ఆధారాలతోనూ చరిత్ర పరిశోధకులు రచించిన కాకతీయుల చరిత్రకూ, జనశ్రుతంగా వచ్చి మెకంజీ స్థానిక  చరిత్రలలో సేకరించబడి చేరిన కథలోని భాగాలకూ సామ్యాలూ విబేధాలూ, తత్సంబంధ చారిత్రక అంశాలనూ చర్చించుకుంటూ ముందుకు వెళితే–

మొదటగా, ఈ కథ ఆరంభంలో చెప్పబడిన త్రిభువనమల్లుడు చరిత్రకారులు నిర్ణయించిన త్రిభువనమల్ల బేతరాజు అనబడే రెండవ బేతరాజు. ఇతడు క్రీ.శ.1075/76 నుండి 1108/11 దాకా రాజ్యం చేశాడని శాసనాధారాలను బట్టి చెప్పారు. ఇతడు కాజీపేటలో వేయించిన ఒక శాసనంలో తన తాత అయిన మొదటి  బేతరాజును గురించి ‘సామంతవిష్టి వంశః శ్రీమాన్ కాకతిపురాదినాథోబేతః’ అనడాన్ని బట్టి, ఇతడు సామంతవిష్టి వంశం వాడనీ, కాకతిపురాధీశుడనీ చెప్పడం జరిగింది. అయితే ఈ కాకతిపురం ఏది అన్నది ఇప్పటికీ  తేలని విషయం.

కాకతీయులు (2)

కాకతీయులు (2)

రుద్రుడు తన రాజ్యానికి తూర్పుగా వున్న పరగణాల మీదికి దండెత్తి వెళ్ళి, ఆ తరువాత దక్షిణం వైపున రామేశ్వరం, ధణుష్కోటి దాకానూ వెళ్ళి అక్కడ 8 సార్లు తులాపురుషదానాలు చేశాడు. తిరిగి వచ్చే దారిలో పాండ్య రాజును జయించి అతని కుమారునికి పట్టం కట్టి వచ్చాడు.

రుద్రుని తమ్ముడైన మహాదేవుడు ఈ లోపల, కొంత సైన్యాన్ని సమకూర్చికుని అన్నపై తిరగబడ్డాడు. రుద్రుని పాలన 78 సంవత్సరాలు సాగి శకసంవత్సరం 1109 లో (ఇది తప్పు అని చరిత్ర) ముగిసింది. ఈ రుద్రుడు కాకతీయులలో  ప్రతాపరుద్రుడు కాదు, ఇతడు గణపతిదేవునికి తండ్రి అయిన రుద్రుడు మాత్రమే.

మహాదేవుని వంచనతో కూడిన ఆక్రమణాన్ని ఇష్టపడని మంత్రులు, రుద్రుని కుమారుడైన గణపతిని రాజ్యాభిషిక్తుని చేయబోగా, గణపతి యువరాజుగానే ఉండడానికి ఇష్టపడినందువలన, మహాదేవుడు రాజై మూడేళ్ళు పాలించాడు. మహాదేవుడు గణపతి అనుమతితో దేవగిరిపైకి దండెత్తి వెళ్ళి ఆ పోరులో ఒక ఏనుగుపై ఎక్కి యుధ్ధం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

గణపతిదేవుడు శ్రీశైలం పరిసరాలనుంచి తెచ్చిన శిలలతో వరంగల్లు కోటనూ, శివునికి దేవాలయాలను నిర్మింప జేశాడు. మహాభారతాన్ని తెనిగించిన తిక్కన మహాకవి  (నెల్లూరు రాజైన మనుమసిధ్ధి రాయబారిగా) గణపతి ఆస్థానానికి రాగా,ఆ రాజూ, అతని ఆస్థానంలోని కవులూ పండితులూ ఆయనను గొప్పగా సత్కరించారు. గణపతిదేవునికి  తిక్కన వేదాలనూ, శాస్త్రాలనూ, మహాభారతాన్ని అధ్యయనం చేయడం లోని ముఖ్యాంశాలను గురించి వివరంగా చెబుతాడు. గణపతిదేవుని ఆస్థానంలోని జైనులతోనూ, బుధ్ధులతోనూ తీవ్రంగా వాదించి వారిని నిరసించాడు. రాజకీయం మీద, వేదాంత విషయాల మీద తిక్కన గణపతిదేవునికి తగు బోధ చేశాడు.

అక్కన, బయ్యన అనే వారిచే సూర్యవంశీయుడైన మనుమసిధ్ధి తన రాజధాని నుంచి తరిమివేయబడినాడనీ, ఆ రాజుకి అతని రాజ్యాన్ని  తిరిగి దక్కించుకోవడంలో గణపతిదేవుని సహాయాన్ని అర్ధించడం, తాను వచ్చిన పనిగా తిక్కన చెబుతాడు. గణపతిదేవుడు  ఆ కార్యానికి అంగీకరించి తిక్కనను తగు విధంగా సత్కరించి బహుమతులిచ్చి పంపుతాడు. తిక్కన వెళుతూ, శైవుడైన శివదేవయ్యను గురించి గొప్పగా చెబుతాడు. శివదేవయ్య తరువాతి కాలంలో కాకతీయ రాజులకు మంత్రి అయ్యాడు.

మాట ఇచ్చినట్లుగానే, గణపతిదేవుడు  పెద్ద సైన్యంతో  వెళ్ళి, వెలనాడును ముట్టడించి, జయించి వారి కోటను తగులబెట్టించాడు. బయ్యనను తరిమివేసి అతని రాజముద్రికలను తెరల రుద్రదేవునికి ఇస్తాడు. మనుమను నెల్లూరులో పునః ప్రతిష్టించి, తాను జయించిన 24 దుర్గాలనూ, 68 పట్టణాలనూ అతనికి బహుమానంగా ఇచ్చి, వరంగల్లుకి తిరిగి వచ్చాడు.

తన కోటను మరింతగా సంరక్షించుకోవాలని, రాత్రి పగలనిలేక  నిరంతరం కోటచుట్టూ సైనికులు కాపలా వుండేలా నియమం చేస్తాడు. ఒక అక్షౌహిని సైన్యాన్ని కోటలో ఎప్పుడూ సిధ్ధంగా వుండేలా ఏర్పాటు చేస్తాడు. అతని పాలన పటిష్ఠంగా సుఖంగా సాగింది.

గణపతిదేవుడు శ్రీశైలం దర్శించి అక్కడి దేవుడైన మల్లికార్జునునికి 12,000 సువర్ణ పుష్పాలను సమర్పించాడు. ఆ రోజుననే, పంధలింగాల కు వెళ్ళి, కృష్ణానదిలో  స్నానంచేసి 16 రకాల దానాలను చేశాడు. శ్రీశైలంలో 4 చెరువులను, 4 శైవాలయాలను ఒక వైష్ణవాలయాన్ని నిరిమింపజేశాడు. మల్లికార్జునారాధ్యుని చేతులమీదుగా శైవుడయ్యాడు.

వరంగల్లుకు 3 యోజనాల దూరంలో తన పేరు మీదుగా గణపురమనే గ్రామాన్ని, చెరువును నిర్మింపజేశాడు. కటకాన్ని పాలిస్తూండిన రాజును తన సామంతునిగా చేసుకున్నాడు. మొత్తం మీద గణపతిదేవుడు 68 సంవత్సరాలు పాలించాడు. అతనికి ఉమ్మక్క అని ఒక కూతురు వుంది. ఆమెకు వయసు రాగానే, చాళుక్య వంశానికి చెందిన వీరభద్రునితో వివాహం జరిపించాడు.

గణపతిదేవుని తరువాత ఆతని భార్య రుద్రాంబ, శివదేవయ్య సలహాతో, రాజ్యభారాన్ని స్వీకరించింది.

ఆమె చాలా మంది దేవతలను సువర్ణ పుష్పాలతో, ఆమె కూతురయిన ఉమ్మక్క ద్వారా వీరుడయిన మనుమడిని పొందాలని పూజించి ‘దశరీడ్లనోము’ అనే పేరున్న నోము నోచింది. ఆ పూజా కార్యక్రమాలలో భాగంగా ఆమె వరంగల్లులో లేని సమయంలో హరిహరదేవుడు మురారి అనే ఇద్దరు సామంతులు తిరుగుబాటు చేయగా, వారిని ఓడించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

దేవగిరి పాలిస్తూండిన రాజు అకారణంగా వరంగల్లు మీద దండెత్తి వచ్చి కోటను ముట్టడించాడు. అయితే, ఓడించబడి ఒక కోటి దనాన్ని పరిహారంగా చెల్లించేలా చేయబడ్డాడు. ఆమె తన రాజ్యానికి సరిహద్దు రేఖల వెంబడి విజయస్తంభాలను పెట్టించింది. రుద్రాపురం, అంబాపురం అనే పేర్లతో రెండు గ్రామాలు ఆమె పేరుమీద నిర్మించబడ్డాయి.

కాకతీయులు (1)

కాకతీయులు (1)

ఆంధ్రుల చరిత్రలో కాకతీయులది ఒక ప్రముఖ స్థానం. మెకంజీ సేకరించిన స్థానిక చరిత్రలలో అనుమకొండ హనుమకొండకు తొలి రూపం), వరంగల్లులను గురించి, ఈ రెండు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించిన కాకతీయ రాజుల వంశావళిని గురించి చెప్పే గాథలు వున్నాయి. చరిత్ర పరంగా చూసినప్పుడు ఈ గాథలకు, కొన్ని కొన్ని చోట్ల అతిశయమూ కల్పనా  చేరి వుండడం వలన, అన్నిటికీ అంతగా ప్రాముఖ్యం లేకపోయినప్పటికీ, కొన్ని వందల సంవత్సరాలుగా జనశ్రుతంగా తరం నుంచి తరానికి వచ్చి చేరినవి కాబట్టి, ఆంధ్ర దేశ చరిత్ర రచన మొదలెట్టిన తొలినాళ్ళలో ఆ కథలలోని విషయాలు కొన్నైనా ఆధారాలుగా నిలిచాయి కాబట్టీ వాటి  ప్రాముఖ్యత వాటిది. కాకతీయుల చరిత్రకు సంబంధించి  ఆ గాథలలో చరిత్రకు దగ్గరగా వున్నట్లనిపించే కొన్న గాథల సారాంశం ఇది:

కాకతీయ వంశానికి చెందిన మొదటి తరం రాజులలో ఒక రాజు త్రిభువనమల్లుడు. ఆ రాజుకి కాకతి అనే  దేవత కరుణ వలన కాకతి ప్రోలుడు జన్మించాడు. త్రిభువనమల్లుడు కటకాన్ని పాలిస్తూండిన  తిరుగుబాటుదారయిన రాజును రణంలో ఓడించి చంపి, ఆ స్థానంలో అతని కుమారుని రాజ్యాభిషిక్తుని చేసి, ఆ రాజు ధనాగారాన్ని వెంట తరలించుకు వెళ్ళాడు. గంగాపురం అనే ప్రదేశంలో త్రిభువనమల్లుడు ఎన్నో  దేవాలయాలను నిర్మింప జేశాడు.  ఈ రాజు 86 సంవత్సరాలు పాలించి శక సంవత్సరం 958 లో మరణించాడు.

ప్రోలుడు రాజ్య భారాన్ని చేపట్టే నాటికి చాలా చిన్నవాడు. ఇది అదనుగా చూసుకుని సామంతులు కొందరు తిరగబడతారు. కటకాన్ని పాలిస్తూండిన రాజు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విశ్వనాథదేవుడనే వాడిని ప్రోలుని మీదికి దండు పంపుతాడు. అనుమకొండ అతడి వశమవుతుంది. ఆ తరువాత 12 సంవత్సరాలు అనుమకొండ పరరాజుల హస్తగతమై వుంటుంది. ఈ కాలంలో వారు ఒక పెద్ద చెరువును కూడా తవ్వించారు. కన్నడసముద్రమని ఆ చెరువుకు పేరు. ప్రోలుడు తన రాజధానిని ఒక స్నేహితుడైన సామంతుని అధీనంలో వుంచి, ఒక రహశ్య మార్గం ద్వారా వెళ్ళి అనుమకొండను జయించి, మళ్ళీ కటకం మీదికి దండు వెళ్ళి, యుధ్ధంలో ఆ రాజును చంపి, వాని కుమారుని ఆ స్థానంలో వుంచి, 2 కోట్ల
సంపదను సంపాదించుకొస్తాడు.

ఈ ప్రొలుడు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మింపజేసి, ఆ దేవాలయం చుట్టూ 8 యోజనాల పర్యంతగా వుండే ఒక నగరాన్ని కూడా నిర్మింపజేస్తాడు. ఇదే ఓరుగల్లు పట్టణం. ఓరుగల్లు కోటకు తొలి నమూనా చిత్రం ఆ స్థానం మీద 909 లో వ్రాయబడింది.

వరంగల్లులో శివాలయం పరశువేది శంభు ఆలయంగా పిలవబడేది. ఆ ఆలయానికి ఆగ్నేయంగా ఒక పెద్ద శిల వుండేది, కనుక ఆ ప్రదేశానికి ఏకశిలానగరమనీ, ఆ ప్రదేశం మీదుగా వెళ్ళే బండి చక్రం ఒకటి ఎప్పుడూ ఒకవైపుకు ఒరిగేది కాబట్టి ఆ ప్రదేశానికి ఓరుగల్లు అనీ పేర్లు వచ్చాయి.

ఓరుగల్లులోని దేవాలయాలలో ప్రతిష్ఠించబడిన ముఖ్యమయిన దేవతా విగ్రహాలు 1. ముక్తేశ్వర, 2. విశ్వనాథ, 3. వ్యక్తవిరూపాక్ష, మల్లికార్జున, 5. రామేశ్వర, 6. నీలకంఠ, 500 చిన్న గుడులు శివునివి, 10 దేవివి, 10 గణపతివి, 300 వాసుదేవునివి, 10 వీరభద్రునివి, కొత్తగా నిర్మించబడ్డాయి.

ప్రోలునికి ఒక దుష్టనక్షత్రంలో ఒక కొడుకు పుట్టాడు. ఆ నక్షత్ర ప్రభావం వలన అతడు తండ్రిని చంపేవాడుగా అయ్యాడు.
ఆ పిల్లవాడు రుద్రుడుగా నామకరణం చేయబడి, మంచి తెలివి కలవాడుగా, శక్తిమంతుడుగా పెరిగాడు. అతడికి ఉపనయనం అయిన తవువాత, శంభుని దేవాలయానికి రాజ రక్షకుడుగా నియమించబడ్డాడు.

మహాదేవుడు ప్రోలునికి రెండవ కుమారుడు. ఇతడు కుష్టువ్యాధి పీడితుడయ్యాడు. ఒక బ్రాహ్మణునికి 5 పుట్ల నువ్వులను ఒకచోట పోసి పెద్ద రాసిగానూ, తోడుగా బంగారంతో చేసిన ఆకులను, మాడలను, దానంగా ఇచ్చిన తరువాత ఆ శ్వేతకుష్టు వ్యాధి నుంచి మహాదేవుడు బయటపడ్డాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఆ తరువాత బ్రహ్మరాక్షసునిగా మారాడు. ప్రోలుడు ఆ బ్రాహ్మణుని కుమారునికి పెద్ద మొత్తంలో  ధనమిచ్చి కాశీలో దోష పరిహారార్ధం చేయించవలసిన పూజలను చేయించమని పంపాడు. అలా చేసిన తరువాత, నువ్వులరాసిని దానంగా తీసుకోవడం వలన సంక్రమించిన  దోషం పరిహారమై ఆ బ్రాహ్మణుడు ముక్తిని పొందాడు.

ఒకసారి, ప్రోలుడు శంభులింగమును ప్రార్ధించదలచి దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో లోపలి ద్వారం దగ్గర రుద్రుడు నిద్రపోతున్నాడు. రుద్రుడి నిద్రను భంగపరచడం ఇష్టపడని ప్రోలుడు పక్కనుంచి ప్రవేశించబోగా, అతని పాదం బొటనవ్రేలు రుద్రునికి తగిలి అతడు నిద్ర మేల్కొంటాడు. నిద్రమత్తు పూర్తిగా వదలని రుద్రుడు, ప్రోలుని ఒక దొంగగా భావించి అతని చేతిలో వున్న కటారితో పొడుస్తాడు. అయితే వెంటనే తనచే పొడవబడినది తండ్రేనని గ్రహిస్తాడు. ప్రోలుడు పురోహితులనూ, రక్షకులనూ, మంత్రులనూ అందరినీ పిలిపించి వారికి జరిగిన సంగతిని, దానికి కారణమైన రుద్రుని జన్మకు సంబంధించిన సంగతినీ చెప్పి, రుద్రుడినే తన అనంతరం రాజునిగా పట్టభిషిక్తుని చేయమంటాడు. రుద్రుడు పట్టభిషిక్తుడవుతాడు. కొన్నాళ్లకు ప్రోలుడు మరణిస్తాడు. అనంతరం రుద్రుడు 73 సంవత్సరాలు పాలించాడు. అతని పాలన 1031 లో అంతమయింది.

రుద్రుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ  రాజ్యాన్ని సిరిసంపదలతో నింపాడు. ఓరుగల్లుకు దక్షిణంగా 12 మైళ్ళ దూరంలో వున్న అయినవోలు గ్రామానికి పశ్చిమాన మైలార దేవునికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అనుమకొండకు నాలుగు మైళ్ళు (రెండు కోసులు) దూరంలో వున్న ఒడ్డిపల్లి అనే గ్రామంలో బొద్దన గణపతికి దేవాలయాన్ని నిర్మింపజేశాడు. మొగలిచెర్ల అనే గ్రామంలో మహాశక్తికి దేవాలయాన్ని నిర్మింపజేసి తిరుణాళ్ళు నిర్వహించబడేలా సౌకర్యం చేశాడు.

కటకం మీదకు దండెత్తి వెళ్ళి ఆ రాజును చంపి, ఆ స్థానంలో అతని కుమారునికి పట్టం కట్టి ప్రతిగా సంప్రదాయకంగా రావలసినది గ్రహించి తెచ్చాడు. ఏకుదేవుడు (?) అనే ఒక సామంతుడు తిరుగుబాటు చేయ యత్నిస్తే, అతడిని ఓడించాడు. వచ్చే దారిలో వెలనాడులో ప్రవేసిస్తాడు. ఆ రాజులు అతడి శౌర్యాన్ని మెచ్చుతారు. ఆ తరువాత కొందరు మ్లేఛ్ఛులనూ (?) జయిస్తాడు.

తండ్రిని చంపిన దోషం పోవడానికి చేయాల్సిన దోషపరిహార క్రియలన్నిటినీ నిర్వర్తిస్తాడు. చాలా ధనం ఖర్చుపెట్టి ఓరుగల్లులో మంచి శిల్పకళతో నిండినవైన ఆలయాలను నిర్మింపజేశాడు. 1000 స్థంభాలు ఆ గుడి ప్రాంగణాన్ని అలంకరించి ఉంటాయి.
చతుర్ముఖేశ్వర దేవాలయానికి నాలుగు వైపులా ద్వారాలపై నాలుగు శాసనాలను నాలుగు భాషలలో లిఖింప జేశాడు.
వరంగల్లు పట్టణంలో కొత్త వీధులను, భవనాలను నిర్మింపజేసి బాగా వృధ్ధిపరిచాడు. రుద్రుని తమ్ముడైన మహాదేవుడు కొందరి తప్పుడు సలహాలను విని అతనికి విరోధిగా మారతాడు. అయితే, ఈ సంగతులను గ్రహించిన రుద్రుడు మహాదేవుని కార్యకలాపాలన్నిటినీ ఒక కంట  కనిపెడుతూ వుండాల్సిందిగా మంత్రులను నియోగిస్తాడు. శ్రీశైల మఠాథిపతుల సలహా మీద  గణపతి అనే పేరున్న ఒక బాలుడిని, (ప్రమథ)గణాల అనుగ్రహంతో జన్మించినవాడుగా నమ్మబడుతున్న వానిని, అక్కడినుంచి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు.