‘ఆంధ్రులు-చరిత్ర’
డా.నేలటూరు వేంకటరమణయ్యగారి ‘పల్లవులు-చాళుక్యులు (చారిత్రక వ్యాసములు)’ గ్రంథంలోని రెండవ విషయం ‘ఆంధ్రులు-చరిత్ర’. ఇది 1949వ సంవత్సరం డిశెంబరు నెల 12వ తేదీనాడు వాల్తేరు ఆంధ్రవిశ్వవిద్యాలయ యూనియన్ వారు చేసిన ఆంధ్రవారోత్సవ సందర్భంలో ఇచ్చిన ఉపన్యాసం అని గ్రంథం 27వ పుట అధోజ్ఞాపికలో ఇచ్చిన వివరం.
ఇది కూడా 27పుటల సుదీర్ఘ వ్యాసం. ఇందులో ఆంధ్రులు తొలుతగా ఎవరు? ఎక్కడివారు? ఏ జాతి? చరిత్రలో వారి విజయాలేమిటి? అనే ప్రశ్నలకు సమధానాలిస్తూ, చరిత్రపూర్వ యుగం దగ్గరనుంచి మొదలెట్టి విజయనగర సామ్రాజ్యం దాకా విషయాలన్నిటినీ ఒక మోస్తరు వివరంగా చర్చించారు. సంగ్రహంగా ఆ వ్యాసపు సారాంశం ఇది:
మొదటగా, ఆంధ్రులు ఎవరు? అనేది సమాధానం వెదకాల్సిన ప్రశ్న. ఆంధ్రులు అంటే ఆంధ్రదేశవాసులనీ, ఆంధ్రదేశమంటే ఇప్పటి తెలుగుభాషను మాట్లాడే జనులు నివసించే దేశమనీ సర్వసాధారణంగా అంగీకరించబడుతున్న సంగతి. అయితే, చరిత్రపరిశోధకులలో చాలామంది దీనితో ఏకీభవించరు. ఆంధ్రులనే తెగవారు ఒక్కరుకాదని, తెలుగువారితో వాళ్ళతో వారికి ఎలాంటి సంబంధమూ లేదని, తెలుగుదేశం తొలుత వారి నివాస స్థలం కాదని, ఆంధ్రులు మాట్లాడిన భాష తెలుగు కాదని, అది ప్రాకృతమని వాదించే చరిత్ర పరిశోధకులు ఎందరో ఉన్నారు. వారి వాదంలో సర్వమూ అంగీకార యోగ్యం కాకపోయినా, అందులో కొంత నిజమూ లేకపోలేదు. ఆంధ్రుల తొలి నివాసస్థానము తెనుగుదేశము కాదు. ఉత్తరపారశీకమునందు అంక్షునదీ తీరంలో ఆంధ్రులు నివసిస్తూ వుండినట్లు కొన్ని పురాణాలు చెప్పాయి. వింధ్య ప్రాంత దేశంలో వుండినట్లు ఐతరేయబ్రాహ్మణము చెప్పింది. గంగా తీరంలో వుండినట్లు మరికొన్ని గ్రంథాలలో కనిపిస్తుంది. ఆంధ్రజాతీయులైన ప్రాచీన సాతవాహనవంశజులు తమ శాసనాలన్నిటినీ ప్రాకృతభాషలో ప్రకటించారు. అలాగే, సాతవాహనవంశజులను ఆశ్రయించి గ్రంథరచన చేసిన గుణాఢ్యాది కవులు తమ గ్రంథాలను ప్రాకృతంలోనే రచించారు. క్రీ.శ.7వ శతాబ్దానికి ముందు తెలుగుభాష ఉండినదని నిరూపించడానికి తగిన ఆధారాలేవీ లేవు. అందువలన, ఆంధ్రుల నివాస స్థానం ఇప్పటి తెలుగువారు నివసించే దేశము కాదు; వారి భాష తెలుగు కాదు అనీ ఒప్పుకోవాల్సి ఉంటుంది.
కాని, ఆంధ్రులు వేరు, తెలుగువారు వేరు అనడం కూడా సరియైనది కాదు. తొలుత ఆంధ్రుల నివాసస్థానం ఏది అయినప్పటికీ, బౌధ్ధ మౌర్య యుగముల నుండీ దక్షిణాపథంలో కొంచెం ఇంచుమించుగా ఇప్పటి తెలుగుదేశంలోనే ఉన్నట్లుగా బౌధ్ధవాఙ్మయంవలనా, మౌర్య శాసనాలవలనా, గ్రీకు గ్రంథములవలనా విదితమవుతుంది. అంతేకాక, ఆంధ్రపథము, సాతవాహనరాష్ట్రము, సాతవాహనకోట మొదలైన స్థలములు, ఆంధ్రికానది ఇప్పటి తెలుగుదేశంలోనే ఉండడంవలనా, శాసనాలలో, వాఙ్మయంలో క్రైస్తవశక ప్రారంభంనుంచే ఆంధ్రులనే పేరు తెలుగువారికే చెల్లుతూండడంవలనా, తొలుత ఆంధ్రులు ఏప్రదేశంలో నివసిస్తూ ఉండినా బౌధ్ధయుగ ప్రారంభకాలంనాటికే వారు ఇప్పటి తెలుగుదేశానికి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారనీ, అప్పటినుండి ఈ ప్రదేశం ఆంధ్రావని అయిందనీ చెప్పుకోవాలి.
జాతిచే ఆంధ్రులెవరు? అనేది ఇంకొక ప్రశ్న. ద్రావిడులని కొందరు, ఆర్యులని కొందరు సమాధానంగా చెబుతారు. నిజానికి ఈ రెండిటిలో ఏదీ పూర్తి నిజం కాదు. ప్రపంచంలో ఎక్కడా స్వచ్చమైన జాతిలేదు. అన్నీ మిశ్ర జాతులే. ఆంధ్రులు ఉత్తరభారతాన్నుంచి ఇక్కడికు చేరుకున్నపుడు ఈ ప్రదేశం నిర్మాణుష్యమైన కాడు కాదు. రామాయణకాలం నాటికే గోదావరీ తటప్రదేశానికి జనస్థానమని పేరు వచ్చివుంది. ఇక్కడ జీవనం సాగిస్తూవుండిన ప్రజలు ఆదిమ ఖాండులు, కోయలు అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మొదట ద్రావిడులు ఆక్రమించుకుంటే, ఆ తరువాత ఆంధ్రులు వచ్చారు. ఈ మూడుజాతుల సమ్మేళనంతో ఆంధ్రజాతి మిశ్రజాతిగా మారింది. ఈ సమ్మేళనంవలన కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. అందులో ఒకటి భాషాత్మకమైన మార్పు. ఆంధ్రుల ప్రాకృతం, ద్రావిడుల అరవము కలవడంవలన రెండు నూతన భాషలు ఏర్పడినాయి. తూర్పున తెలుగు, పశ్చిమాన కన్నడము. తూర్పున ద్రావిడుల కంటే ఆంధ్రులు ఎక్కువవడంవలన ఆంధ్రుల భాషలో ప్రాకృత సంస్కృత శబ్దాలు ఎక్కువ అయ్యాయి. పశ్చిమాన ఆంధ్రుల కంటే ద్రావిడులు ఎక్కువవడం వలన అక్కడి పలుకుబడిలో ద్రావిడ శబ్దజాలం ఎక్కువైంది. తూర్పున ఆంధ్రుల సంఖ్య ఎక్కువవడంతో ఆంధ్రదేశమని పేరు వచ్చింది. పశ్చిమమున కర్ణ రాజులపేర కర్ణాటకమని పేరు వచ్చింది. ఆంధ్ర కార్ణాటకులు ఈ విధంగా వేరయినప్పటికీ, వారి ఇరువురి సంస్కృతీసంప్రదాయాలు ఒకాటిగానే ఉన్నాయి. దక్షిణాపథంలోని అన్యజాతుల కంటే, ఆంధ్రకర్ణాటకులకు ఒకరొకరితో సామ్యం ఎక్కువగా కలిగింది. ఈ సందర్భంలో జ్ఞప్తికి తెచ్చుకోవలసిన చారిత్రక ఘటన చాళుక్యుల దండయాత్ర.
చాళుక్యులు కర్ణాటకులు. క్రీ.శ.7వ శతాబ్దం పూర్వార్ధంలో వీరి ప్రభువు ఇమ్మడి సత్యాశ్రయపులకేశి వల్లభుడు తూర్పు సముద్రతీరంలోని కృష్ణా గౌతమీ మధ్యస్థిత ఆంధ్రదేశాన్ని జయించి అక్కడ తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని రాజుగా ప్రతిష్ఠించాడు. ఈ సంఘటనతో ఆంధ్రదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. తూర్పుతీరంలోని వేంగీ మండలంలో ఒక నూతన రాజవంశం పూర్వ చాళుక్యులన్న పేరుతో ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావంతో చాళుక్యులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నప్పుడు, వారితో పాటుగా వారి స్త్రీజనం, పరివారం, పండితజనులు, ఉద్యోగులూ, వర్తకులూ, చతురంగబలములూ ఇక్కడకు చేరాయి. వీరంతా కర్ణాటకులే. ఈ పరిణామంతో ఇక్కడి జనసామాన్యం మిశ్రీభూతమైంది. ఈ ప్రజాసమ్మిశ్రణం వల్ల ఆచారవ్యవహారాలలో కొంత మార్పు వచ్చింది. భాషలో మార్పు వచ్చింది. కన్నడ పలుకుబడులు కొన్ని తెలుగున ప్రవేశించాయి. ఇంచుమించుగా ఇలాంటి సమ్మిశ్రణమే క్రీ.శ.11-12 శతాబ్దములలో ద్రావిడుల కలయిక వలన జరిగింది. ప్రథమశక్తివర్మ వేంగీ సింహాసనన్ని అధిష్ఠించినది మొదలు పూర్వచాళుక్య చోళరాజకుటుంబముల మధ్య వివాహసంబంధాలు ఏర్పడ్డాయి. వేంగిరాజులు చోళచక్రవర్తులకు అరిగాపులయ్యారు. రాజ్రాజనరేంద్రుని నిర్యాణానంతరం వేంగిరాజ్యం చోళసామ్రాజ్యంలో లీనమైపోయింది. రాజరాజనరేంద్రుని కుమారుడైన రాజేంద్రదేవుడు (ఇతడే తరువాత కుళోత్తుంగచోళుడుగా మారాడు) ఉభయరాజ్యములకూ అధిపతియై అరవలలో కలిసిపోయాడు. మేనమామయగు చోళచక్రవర్తి ఇమ్మడి రాజేంద్రదేవుని పుత్రికయైన మధురాంతకీ దేవిని పెండ్లాడి తన జన్మనామమైన రాజేంద్రదేవుడనే పేరును వదిలి కుళోత్తుంగచోళుడయ్యాడు. ఈ పరిణామంతో పెక్కండ్రు అరవ ఉద్యోగస్థులు ఆంధ్రదేశంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పటి ఆంధ్రబ్రాహ్మణ్యంలో మూడవవంతు ద్రావిడ బ్రాహ్మణులు ఉన్నారు. వీరితోపాటు అరవకరణ అరవవెలమ బేరి ముదిలియారుపిళ్ళలు అనేకులు ఆంధ్రదేశంలో నివసిస్తున్నారు. ఇందువలన తెలిసేది, ఆంధ్రులు కొందరనుకొనునట్లు స్వచ్చమైన జాతికాదు; వారు కేవలము ఆర్యులు కారు, ద్రావిడులూ కారు; ఆంధ్రులు మిశ్రజనులు. ఇది సత్యం.
ఆంధ్రులు సామ్రాజ్య నిర్మాతలు. భారతదేశ చరిత్రలో సుప్రసిధ్ధి చెందిన సామ్రాజ్యములు రెండు వారిచే సృజించబడ్డాయి. వీటిలో మొదటిది సాతవాహన సామ్రాజ్యం. క్రీ.పూ.240 నుండి క్రీ.శ.220 వరకు, 460 సంవత్సరములు ఈ రాజవంశం పరిపాలన సాగించింది. భారతదేశ చరిత్రలో ఏరాజవంశమూ ఇంత సుదీర్ఘకాలం పరిపాలించియుండలేదు. ఇంత సుదీర్ఘకాలం పరిపాలించియున్నప్పటికీ, వారి చరిత్రను గూర్చి కాని, వారి పరిపాలన క్రింద నడిచిన విశేష చరిత్రాంశములను గూర్చి కాని మనకు తెలిసినది అత్యల్పం. అయినప్పటికీ, తెలిసినంతలో వారి యేలుబడిక్రింద నడిచిన కొన్ని ముఖ్యాంశములను వివరించుటకు అవకాశం ఉంది. ఇందులో మొదటిది హిందూ ధర్మోధ్ధరణం. రెండవది నౌకానిర్మాణము, ద్వీపాంతర వాణిజ్యము. మూడవది స్త్తూపచైత్యాది శిల్పనిర్మాణము, నాల్గవది ప్రాకృతవాఙ్మయ పోషణ. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథ (ప్రాకృత) సాహిత్యంలో ఉత్తమోత్తమమైన రచనలు.
ఆంధ్రులచే నిర్మించబడిన రెండవ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. హిందూధర్మ రక్షణకొరకే ఈ సామ్రాజ్యమూ నిర్మించబడింది. క్రీ.శ.13వ శతాబ్దాంతంలో మహమ్మదీయులు దక్షిణాపథంలో అడుగుపెట్టారు. వారి రాకతో దక్షిణాపథంలో హిందూ రాజ్యాలయిన కాకతీయ (ఆంధ్ర), హొయ్సల (దక్షిణ కర్ణాటక), పాండ్య (ద్రవిడ), యాదవ (ఉత్తర కర్ణాటక) రాజవంశాలకు విపత్తు సంభవించింది. క్రీ.శ.1295-1326 మధ్య కాలంలో ఈ రాజవంశాలన్ని మహమ్మదీయుల ధాటికి తట్టుకోలేక కూలిపోయాయి. స్వతంత్రహిందూ ప్రభువెవ్వడూ లేక హిందూ సంస్కృతికి, ధర్మమునకూ ముప్పు వాటిల్లింది. దక్షిణాపథాన్ని ఈ విపత్తునుంచి కాపాడుకోవడానికై ఆంధ్రనాయకులందరూ ఒకచోట సమావేశమై ఒక జాతీయసమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితికి ముసునూరుప్రోలయనాయకుడు అధిపతి. ఈతని ఆధిపత్యంలో ఆంధ్రనాయకుల ఉద్యమం జయప్రదంగా కొనసాగింది. కాకతీయ రాజ్యం కూలిపోయిన 15 సంవత్సరములలోపలనే ఆంధ్రులు మహమ్మదీయులను పారద్రోలి తమ స్వాతంత్రాన్ని తిరిగి స్థాపించుకున్నారు. తీరాంధ్రమంతా తిరిగి ఆంధ్రుల వశమైంది. ఇది జరిగిన కొన్నాళ్ళకు ముసునూరుప్రోలయనాయకుడు దివంగతుడయ్యాడు. నాయకులందరూ మళ్ళీ ఏకమై ప్రోలయనాయకుని స్థానంలో అతని సోదరుని పుత్రుడైన కాపయనాయకుడిని సమితికి అధిపతిగా ఎన్నుకున్నారు.
కాపయనాయకుడు అసాధారణ పురుషుడు, దూరదృష్టిగల రాజ్యతంత్ర మర్మజ్ఞుడు. మహమ్మదీయులతో పోరాడి గెలుచుకున్న స్వాతంత్ర్యం మళ్ళీ చేజరిపోకుండా నిలిచేలాచేసి దక్షిణాపథాన్నంతా సురక్షితంచేయాలంటే దాక్షిణాత్యహిందూరాజులలో కెల్ల గొప్పవాడునూ బలవత్తముడును ఐన హొయ్సల ముమ్మడి బళ్ళాలదేవుని సహాయసహకారాలు లేకుండా సాధ్యపడదని ఆలోచించి హొయ్సల రాజదాని ద్వారసముద్రమునకు వెళ్ళి బళ్ళాలదేవునితో చర్చించి ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఈ ఒడంబడిక ఫలితార్ధం – దాక్షిణాత్యహిందూ సంఘమునకు బళ్ళాళుడు అధిపతియై స్వాతంత్ర్య యుధ్ధమును సాగించడం; తెలింగాణమునుండి మహమ్మదీయులను తరిమివేసి ఓరుగంటిని స్వాధీనపరచుకోవడానికి అవసరమైన సైన్యాన్ని కాపయనాయకునికి తోడుగా పంపడం. అల్పకాలంలోనే వారి కోరిక తీరి ఓరుగల్లు తిరిగి కాపయనాయకుని హస్తగతమైంది. అయితే ద్రావిడదేశంలోని చోళపాండ్యరాజ్యాలు ఇంకా మహమ్మదీయుల దాడినుండి విముక్తమై సురక్షితం కాలేదు. ఇందుకోసం మధురసుల్తానుతో బళ్ళాలుడు సలిపిన పోరులో ప్రారంభదశలో బళ్ళాలునికే విజయంచేకూరినప్పటికీ, తుదకు క్రీ.శ.1341లో బళ్ళాలుడు తిరుచునాపల్లి యుద్ధములో నిహతుడయ్యాడు. ఇక్కడితో హొయ్సల రాజవంశం అంతరించింది. బళ్ళాలుని మరణం తరువాత అతని స్థానాన్ని విజయనగర ప్రభువులు అధిష్ఠించారు.
విజయనగర సంస్థాననిర్మాతలు హరిహరబుక్కరాయలను ఇద్దరు ఆంధ్ర సోదరులు. మొదటలో వీరు ఓరుగంటి ప్రతాపరుద్రుని కొలువులో కోశాగారప్రతీహారులై వున్నవారు. క్రీ.శ.1323లో ఓరుగల్లు మహమ్మదీయుల హస్తగతమైనప్పుడు వీరిరువురు అచ్చటినుండి తప్పించుకుని పోయి కంపిలిలో వీరకంపిలిరాయల నాశ్రయించి అతని కోలువులో చేరారు. క్రీ.శ.1326లో ఢిల్లీ సుల్తాను కంపిలిరాయలను చంపి అతని రాజ్యాన్ని తనరాజ్యంలో కలుపుకున్నపుడు వీరిరువురు బందీకృతులై ఢిల్లీకి తీసుకుపోబడి, అక్కడ మహమ్మదీయులుగా మతమార్పిడి చేయబడ్డారు.
ఇది ఇలావుండగా, క్రీ.శ.1330లో ఆంధ్రజాతీయసైన్యములు ఆరవీటి సోమదేవుని ఆధీనములో వుండిన పశ్చిమాంధ్రదేశాన్ని పూర్వకంపిలిరాజ్యంతో సహా ఆక్రమించి స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమాచారం అందినవెంటనే ఢిల్లీ సుల్తాను హరిహరబుక్కరాయలరను ఇరువురినీ కంపిలికి అధిపతులుగా నియమించి, తగినంత సైనాన్ని తోడుగా ఇచ్చి, పోయిన కంపిలిని తిరిగి స్వాధీనపరుచోవడానికి పంపాడు. ఈ కార్యంలో తొలుత పరాజయం ఎదురైనా విద్యారణ్యులవారి ప్రసాదంతో చివరకు అందులో కృతకృత్యులై హరిహరబుక్కరాయ లిరువురూ స్థిరంగా అక్కడ రాజ్యంచేయడం మొదలుపెట్టారు.
హరిహరబుక్క విద్యారణ్యులసమాగమము దక్షిణభారతదేశ చరిత్రలో ఒక సుమధుర ఘట్టం. ఒక మరువరాని విశేషాంశం. దక్షిణభారతదేశ చరిత్రను ఇది ఒక నూతనమార్గానకు తిప్పింది. విద్యారణ్యస్వామి మధ్యయుగ హిందూప్రపంచమును ఉధ్ధరించ వెలసిన మహాపురుషుడు, విశాలహృదయుడైన సన్యాసి. మహా జ్ఞాని. అద్వైతవేదాంతమున మొదటిబంతిలోని వాడు. సర్వతంత్రస్వతంత్రుడు, రాజ్యతంత్రపారంగతుడు. ధర్మోపదేశంతో తిరిగి హరిహరబుక్కరాయలనిరువురినీ హిందూమతానుయాయులుగ జేసి, వారిరువురు పంపావిరూపాక్షస్వామి ప్రతినిధులుగా దక్షిణదేశమంతటినీ పాలింతురని ప్రకటించారు. వారి ఆజ్ఞ మేరకు హరిహరబుక్కరాయలిరువురు డిల్లీసుల్తానును ధిక్కరించి స్వతంత్రులై క్రీ.శ.1336వ సంవత్సరం ఏప్రెలు 18వ తేదీనాడు పంపావిరూపాక్షస్వామి సన్నిధిన రాజ్యాభిషిక్తులయ్యారు. ఆ శుభముహూర్తాననే విజయనగరమను నూతన రాజధాని నగరానికీ శంకుస్థాపన జరిగింది. ఇది సంగ్రహంగా విజయనగరసామ్రాజ్య స్థాపన వృత్తాంతం. మూడువందల ఏండ్ల పాటు దక్షిణభారతదేశాన్ని మహమ్మదీయ పాలకులనుండి కాపాడిన సామ్రాజ్యం ఇది. కృష్ణ దాటి రావలయునని మహమ్మదీయులు; వారిని దాటి రానీయకూడదని విజయనగర చక్రవర్తులు. ప్రధాన రణరంగము కృష్ణా తుంగభద్రల నడిమిప్రదేశం. మహమ్మదీయులతో హోరాహోరీగా పోరాడి, వారి రాకకు అడ్డుకట్టవేసి, హిందూసంస్కృతి సంకరముకానీయకుండా ఆపడమేకాక ఆ సంస్కృతిని కాపాడడానికై పలువిధాలుగా విజయనగర ప్రభువులు పాటుపడ్డారు. మొట్టమొదటినుండి చిట్టచివరి వరకు విజయనగర ప్రభువులు వైదిక ధర్మాన్ని పోషించి వేదమార్గప్రతిష్ఠాపనాచార్యులనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ప్రాచీన దేవాలయాలను బాగుచేయించడమే కాక వేలకొలది నూతన దేవాలయాలను నిర్మింపజేసి వాటిలో పూజాపురస్కారములు నిరంతరాయముగా సాగడానికి తగిన ఏర్పాట్లను చేసారు.
ఆంధ్రవాఙ్మయానికి విజయనగరప్రభువులు చేసిన సేవ అమూల్యమైనది. మొదటి హరిహరరాయలకాలంనుండి ముమ్మడి శ్రీరంగరాయలవరకూ ఆంధ్రకవులను ఆదరించని రాయడు లేడు. వారి ఆశ్రయంలో ఆంధ్రవాఙ్మయం తామరతంపరగా వృధ్ధి చెందింది. రాయల ఆస్థానం ఆంధ్ర ప్రబంధమునకు జన్మస్థానం. యక్షగాన, వచనకావ్యములు మధుర తంజావూరు నాయకుల ప్రోత్సాహమువలన వృధ్ధిచెందాయి.
విజయనగర రాజులకాలంలో దేవాలయ వాస్తు కొత్త దారులు తొక్కింది. విజయనగరఫక్కి అని ఒక నూతనఫక్కి ఏర్పడింది. హంపి, పెనుగొండ, చంద్రగిరి, తంజావూరు, మధుర మొదలగు ప్రదేశాలలో పెక్కు ప్రాసాదాలు నిర్మించబడినాయి. కర్ణాటక సంగీతము కూడా విజయనగర సంస్థానంలో పెరిగినదే. రాయసంస్థాన స్థాపనకు పూర్వం ఆంధ్రసంగీతము ఏస్థితిలో వుండినదో తెలుసుకోవడానికి ఆధారములు లేవు; కాని, రాయసామ్రాజ్య స్థాపన తరువాత దేశంలోని అన్నిప్రాంతాలలోనూ అది జనాదరణమునకు పాత్రమైంది. రాచకొండలో సర్వజ్ఞసింగభూపాలుడు, కొండవీటియందు కుమారగిరి పెదకోమటి వేమారెడ్డి సంగీతశాస్త్రగ్రంథములను రచించారు. క్రీ.శ.15వ శతాబ్దపూర్వార్ధంలో సాళువగోపతిప్పన, కల్లరుసు అనువారు విజయనగరరాయల ఆస్థానాన్ని అలంకరించారు. అటుపిమ్మట, కృష్ణరాయల ఆస్థాన విద్వాంసుడు బండారులక్ష్మీనారాయణ తన సంగీతసూర్యోదయంలో కర్ణాటక సంగీతవిశేషములను ఎన్నిటినో వివరించాడు. అచ్యుతదేవరాయలు సుప్రసిధ్ధ వైణికుడు. వీణమెట్లను సరిచేసి రాగరాగమునకు వానిని సవరింపనవలసిన ఆవశ్యకత లేకుండా స్థిరపరిచాడు. దీనికి అచ్యుతరాయవీణ అని పేరు.
తళ్ళికోట యుధ్ధానంతరం రాయరాజధానియైన విజయనగరం ఖిలపడిపోయింది. రాయాస్థానమును ఆశ్రయించుకొని ఉండిన సంగీత విద్వాంసులు, కళావంతులు అందరూ తంజావూరు చేరి అక్కడి నాయకరాజులను ఆశ్రయించారు. ఆంధ్రులచే వృధ్ధిచేయబడిన కర్ణాటక సంగీతం అలా అరవసీమ చేరింది. అది మొదలుగా వారు కర్ణాటకసంగీతాన్ని కాపాడుతూ వచ్చారు.
ఆంధ్రుల చరిత్రకు సంబంధించి తెలిసినదానికంటే తెలియనిదే యెక్కువ. తెలియని విషయాలను తెలుసుకొనడానికి, తెలిసిన విషయాలను చక్కగా గ్రహించడానికి పరిశోధన ఇంకా జరగవలసి వుంది. ఆంధ్రదేశంలో ఒకటిరెండు శిలాశాసనాలన్నా కనుపించని గ్రామాలు లేవు. తామ్రశాసనాలెన్నో గుప్తములై వున్నాయి. ఆంధ్ర భాషకు చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది. ఆంధ్ర వాఙ్మయమును చక్కగా చదవనివాడు చరిత్రపరిశోధకుడు కాలేడు. చరిత్ర జ్ఞానము లేనివానికి మన కావ్యాలు అర్ధము కాజాలవు. మన కవులు వారి కాలంలో వాడుకలో వుండిన రాజకీయ సాంఘిక మతాచారవ్యవహారములను తమ కావ్యాలలో వర్ణించారు. వారు చెప్పు కథ రామాయణమైనను అందు వర్ణించబడిన స్త్రీపురుషులందరూ కవుల కాలంలో వాడుకలో వుండిన వస్త్రములను, భూషణములను ధరించారు; వారి కాలపు అచారవ్యవహారాలను అవలంబించారు; అప్పటి ప్రజల వలెనే వర్తించారు. కాబట్టి వాఙ్మయం చరిత్రరచనకు చాలా ఉపయోగకరం అవుతుంది.