నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (1)

నన్నయ భారతం (నా వచనంలో): ఆది పర్వం – ద్వితీయాశ్వాసం (1)

ఆ కథకుడు శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు:

పూర్వం  కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ, వినత అనేవారు సంతానంకోసం అనేక వేల సంవత్సరాలు కశ్యపుడిని ఆరాధించగా, ఆయన ప్రసన్నుడై మీ కోరిక మేరకు వరాలిస్తాను, కోరుకోమంటాడు.

అగ్నితో సమానమైన తేజం కలవారు, పొడుగైన దేహం కలవారు, సద్గుణవంతులైన వేయిమంది కుమారులను  ఇమ్మని కద్రువ కోరుకుంటుండి. ఆ వేయిమంది  కంటే అధిక బలవంతులయిన ఇద్దరు కుమారులను ఇమ్మని వినత కోరుకుంటుంది.

ఆదిలో కశ్యప ప్రజాపతి అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించి  పుత్రకామేష్టి చేశాడు కాబట్టి, కద్రువకు వేయి మంది కొడుకులను, వినతకు ఇద్దరు కొడుకులను వారు కోరుకున్నట్లుగానే గర్భములను ఇవ్వగా, ఆ గర్భములనుంచి కద్రువకు  శేషుడు , వాసుకి, ఐరావత, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ, మణినాగాపూరణ, పింజర, కర్దమ, బహుమూలక, కుండోదర, మహోదర మొదలైన నాగప్రముఖులు పుట్టారు.

తన గర్భంలో వున్న రెండు అండములనుండీ ఎన్నాళ్ళయినా పిల్లలు కలగకపోవడంతో సిగ్గుపడిన వినత త్వరగా తనకూ పుత్రులు కలగాలన్న తపనలో చేసిన తొందరపాటు చర్య వలన, శరీరంలో క్రింది భాగం లేకుండా అర్ధశరీరంతో వికలాంగుడై పుట్టిన అనూరుడు వినతపై కోపించి తాను సంపూర్ణ శరీరుడయ్యే  వరకూ ఆగకుండా తొందరపడిన అవినీతవు కాబట్టి సవతి అయిన కద్రువకు దాసివి కమ్మని శాపం ఇచ్చి, రెండవ అండాన్నుంచి కలిగే పుత్రుడు మహా బలపరాక్రమవంతుడై పుట్టి ఈ దాసిత్వాన్నుంచి విముక్తి కలిగిస్తాడని చెప్పి, సూర్యరథానికి  సారథియై   వెళ్ళిపోతాడు. ఆ తరువాత, అనూరుడు చెప్పినట్లుగా జరిగే సమయం దాకా వేచి ఉండాలని తన గర్భాన్ని రక్షించుకుని ఉంటుంది వినత.

అదలా వుండగా, దేవతలూ రాక్షసులూ క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందే ప్రయత్నంలో మేరు పర్వతం మీదికి అందరూ వెళ్ళి, ఈ సముద్రాన్ని  ఏవిధంగా చిలకాలి, అందుకై సరితూగగల కవ్వమేది, దానికి ఆధారం కాగలిగినదేది అని విచారిస్తూ ఉండగా, వారికి బాసటగా వుండి  హరిహరులిద్దరూ ఆ కార్యం నిర్వహించడానికి పూనుకుని,  ఈ మహాకార్యానికి స్థిరమైనది, అరుదైన ఔషధములుగలిగిన వృక్షములతో గలది అయిన మంథర పర్వతం కవ్వంగా ఉండడానికి సరియైనదని నిర్ణయించగా, ఆ యిరువురిచే పంపబడిన అనంతుడు పదకొండు యోజనాల వెడల్పు అంతే ఎత్తు గలిగిన ఆ మంథర పర్వతాన్ని అనంతశక్తి కలవాడై పైకి పెఱికి ఎత్తగా, అందరూ కలిసి ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో వేసి, క్రింద ఆధారంగా కూర్మరాజును పెట్టి, చిలకడానికి కావలసిన పలుపుగా వాసుకిని అమర్చి, వాసుకి తలలవైపు అసురులు తోక వైపు అమరులు పట్టి  సాగర మథనం మొదలెట్టారు.

ఈ ప్రయత్నంలో నారాయణుడు వారికి కావాల్సిన జవసత్త్వాలను ప్రసాదించాడు. ఒకరి నొకరు ఉత్సాహపరుచుకుంటూ, దేవదానవులు ఇరువురూ సముధ్రాన్ని చిలుకగా చిలుకగా మొదటగా అందులోంచి విషం ఉద్భవించి నాలుగు వైపులా కమ్ముకోగా భయపడి పాఱిపోతూండిన దేవదానవులను, ఆ భయంకర విషాన్ని పట్టి మింగి పరమశివుడు తన గరళంలో దాచి  ఆదుకుంటాడు.

ఆ తరువాత, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఉఛ్ఛైశ్రవమనే గుఱ్ఱము, కౌస్తుభము, ఐరావతమనే ఏనుగు, శ్వేతకమండలం నిండుగా అమృతంతో ధన్వంతరి, ఇలా అనేకం ఉద్భవించగా, అందులో ముల్లోకాలచే కొలవబడే శ్రీదేవి కౌస్తుభము నారాయణుని వక్షస్థలంపై విలసిల్లాయి. ఉఛ్ఛైశ్రవమనే అశ్వము, ఐరావతము ఇంద్రుని చేరుకున్నాయి. ఆపై అమృతాన్ని రాక్షసులు దక్కించుకోగా నారాయణుడు కృత్రిమ నారీ రూపం ధరించి వారికి అధిక మోహం కలిగించినవాడై ఉపాయంతో ఆ
అమృత కలశాన్ని వారి వద్ద నుంచి దక్కించుకుని ఆ కలశాన్ని దేవతలకు ఇవ్వగా, వారు దానిని ఉపయోగించే సందర్భంలో దేవరూపం దాల్చి రాహువు వారితో పంక్తిలో కూర్చుని అమృతం సేవిస్తూండగా పసిగట్టిన చంద్రుడు, సూర్యుడు ఈ విషయాన్ని నారాయణునకు తెలియజేయగా, ఆ అమృతం రాహువు గొంతునుంచి దిగకముందే తన చేతి చక్రంతో వేయగా, రాహువు దేహం కంఠాన్నుంచి  విడియై భువిపై పడి మృతి చెందగా , ముఖం మాత్ర అమృత స్పర్శచేత అక్షయమై నిలిచింది.

ఆనాటినుంచి చంద్రునికి, సూర్యునికి రాహువుతో విరోధం మొదలై శాశ్వతంగా నిలిచిపోయింది.

ఆ తరువాత రాక్షసులు తమకు అమృతం దక్కలేదని తెలుసుకుని, దేవతలతో పొత్తు ఇక చాలని నిర్ణయించుకుని, పోరుకు సన్నధ్ధులై రథాశ్వాలతో విళ్ళి ఘోరమయిన యుధ్ధంలో దేవతలనందరినీ దారుణంగా హింసించసాగారు.  సముద్రతీరంలో అలా జరుగుతున్న యుధ్ధంలో చివరకు నరనారాయణులు ఇరువురూ అసురవీరులను పెక్కండ్రను చంపగా చూసి ధైర్యంకోల్పోయినవారై అసురులు సముద్రంలోకి ప్రవేశించగా, సమరంలో దక్కిన విజయంతో ఉత్సాహం పొందినవారైన దేవతలు అమరపతిని అమృతరక్షణార్ధం ప్రార్ధించి, మంథర పర్వతాన్ని యథా స్థానంలో నిలిపి, తమ తమ నివాసాలకు వెళ్ళి సుఖంగా వున్నారు.

అదలా వుండగా…

అమృతంతో పాటు సముద్రం నుంచి ప్రభవించిన అశ్వం, ఆ సముద్ర తీరంలో ఒక్కటే  ఒకనాడు తిరుగుతూ ఉండగా, కద్రువ వినత వినోదార్ధం ఆ ప్రదేశంలోనే విహరిస్తూన్న తరుణంలో  తెల్లగా అమిత కాంతితో ఆకర్షణీయంగా మెరిసిపోతున్న ఆ అశ్వాన్ని చూసి, కద్రువ వినతతో….

వ్యాఖ్యానించండి